సిబిఐ సోదాపై అబద్దం!: 'మోడీతో గొడవ కేజ్రీకి సరదా'
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సచివాలయంలో సిబిఐ సోదాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లు కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం ఘాటుగా స్పందించారు.
ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో గొడవకు దిగడం కేజ్రీవాల్కు సరదాగా మారిందని వెంకయ్య విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ పైన కేజ్రీవాల్, ఆయన పార్టీ ఆరోపణలు సరికాదని చెప్పారు. ప్రతి విషయంలో చట్టం ఉందన్నారు.
సీబీఐ ఓ స్వతంత్ర సంస్థ అని, దాని అజమాయిషీ ప్రభుత్వ కనుసన్నల్లో ఉండదన్న విషయం కూడా కేజ్రీవాల్కు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. కేజ్రీవాల్ చీఫ్ సెక్రటరీ ఆఫీసులో మాత్రమే తనిఖీలు జరిగాయని తనకు తెలిసిందన్నారు.
తన కార్యాలయం పైన సిబిఐ సోదాలు నిర్వహిస్తోందని, ప్రధాని మోడీ బెదిరింపులకు తాము లొంగమని కేజ్రీవాల్ చెప్పారు. అయితే, కేజ్రీవాల్ చెప్పినట్లు సీఎం కార్యాలయంలో సోదాలు చేయడం లేదు. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి రాజేంద్ర సింగ్ పైన ఆరోపణలు రావడంతో ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
తమ సోదాలకు, రాజకీయాలకు సంబంధం లేదని సిబిఐ స్పష్టం చేసింది. తాము ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయంలో సోదాలు చేయడం లేదని తెలిపింది. ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో సోదాలు చేస్తున్నట్లు తెలిపింది. రాజేంద్ర సింగ్ కొన్ని కంపెనీలకు ఆయాచితంగా లబ్ధి చేకూర్చాడని ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎంవో ఉన్నతాధికారుల అనుమతితోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు సిబిఐ చెప్పింది. రాజేంద్ర సింగ్ కార్యాలయం సచివాలయంలోని మూడో అంతస్తులో ఉంది. ఇది ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా ఉంది.
రాజేంద్ర సింగ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సోదాలతో కేజ్రీవాల్కు సంబంధం లేదని చెబుతున్నారు. అయితే, సోదాల సమయంలో సిబిఐ థర్డ్ ఫ్లోర్ మొత్తాన్ని తన ఆదీనంలోకి తీసుకుంది. పేరుకు సెక్రటరీ కార్యాలయంలో అంటున్నారని, కానీ తన పైనే ఇది దాడి అని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి తోడు సీబీఐ కూడా తాము కేజ్రీవాల్ కార్యాలయం జోలికి వెళ్లడం లేదని చెబుతుంటే, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం తన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయని ట్వీట్ చేయడం గమనార్హం.