అధినేతలకే సవాల్: నంద్యాలలో ఆ రెండు కుటుంబాలే మళ్లీ పోటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఉప ఎన్నిక ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు రానున్నదా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఉప ఎన్నిక ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు రానున్నదా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక సీఎం నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిలకు ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. మరోవైపు 1980వ దశకం నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్న భూమా, 2004 తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన శిల్పా మోహన్ రెడ్డి కుటుంబాలే ఈ ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలువడం విశేషం. ఇరు పార్టీల అధినేతలు అనునిత్యం వ్యూహ ప్రతివ్యూహాలు అమలుజేస్తూ అందరినీ రంజింపజేస్తున్నారంటే అతిశేయోక్తి కాదు.
పరస్పరం ఆయా పార్టీల నేతలను తమ వైపునకు తిప్పుకోవడానికి సకల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన భూమా నాగిరెడ్డి.. మారిన రాజకీయ పరిస్థితుల్లో తన కూతురు అఖిలప్రియతోపాటు సైకిలెక్కేశారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత టిక్కెట్ లభిస్తుందన్న ఆశలు అడియాసలు కావడంతోఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి పాలైన శిల్పా మోహన్ రెడ్డి అవకాశం కోసం వేచిచూస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందేనన్న లక్ష్యంతో చంద్రబాబు నెలలో రెండుసార్లు నంద్యాలలో పర్యటించారు. పలు అభివ్రుద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆశల ఊసులు కల్పించారు.
అంచనాలకందని ఫలితాలొస్తాయా?
రాష్ట్ర మంత్రులు కాలువ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తదితరులు నంద్యాలలోనే తిష్ట వేసి ప్రచారంలో పాల్గొనడంతోపాటు ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ రెండు పార్టీల మధ్యే ఎన్నికలు జరుగుతుండటంతో ఈ దఫా ఏం జరుగుతుందోనని స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ రెండు ఎన్నికలకు ఓ తేడా ఉంది. అదే పార్టీ జెండా. కుటుంబాలు అవే కానీ.. పార్టీ జెండాలే మారాయి. అటు-ఇటు మారిన జెండాలతో ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఆ జెండాలతోపాటుగా ఓటర్లూ మారతారా? అనేది నాడికందకుంది. గెలుపు ఎవరివైపు అనేదే అంచనాలకు అందని పరిస్థితిగా మారింది. దీంతో ఉత్కంఠగా మారిన ఎన్నికలను ఎవరికివారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Recommended Video
ఏకగ్రీవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నో
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి శిల్పా మోహన్రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి పోటీ చేశారు. శిల్పా మోహన్రెడ్డిపై భూమా నాగిరెడ్డి గెలిచారు. నంద్యాల అభివృద్ధి కోసం 2016, ఫిబ్రవరిలో భూమా, ఆయన కుటుంబ సభ్యులు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీలో చేరిపోయారు. దీంతో భూమా, శిల్పా రెండు కుటుంబాలు టీడీపీలోనే కొనసాగాయి. ఈ క్రమంలో 2017, మార్చి 12న భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. సంప్రదాయం ప్రకారం మృతిచెందిన నాయకుడి కుటుంబానికే టిక్కెట్టు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. దీనిలో భాగంగా భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్టు ప్రకటించింది. ఉప ఎన్నికల ఏకగ్రీవానికి ఒప్పుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దించుతుండటంతో... తన క్యాడర్ దెబ్బతింటుందంటూ శిల్పా మోహన్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. చర్చలు జరిపే అవకాశం ఇవ్వకుండా తమ అభ్యర్థిగా శిల్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఇరుపక్షాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వైకాపా నుంచి భూమా కుటుంబం టీడీపీకి రాగా... తెదేపా నుంచి శిల్పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పోటీలో ఆ రెండు కుటుంబాలే మళ్లీ ఎదరుపడుతున్నాయి. అయితే పోటీచేస్తోన్న అభ్యర్థుల పార్టీ జెండాలే మారినట్లైంది.
ఇలా వైఎస్ జగన్ నంద్యాల సభ సక్సెస్
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి (78,590 ఓట్లు)పై భూమా నాగిరెడ్డి (82,194 ఓట్లు)3,604 ఓట్ల మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన ఆ రెండు కుంటుంబాలే ప్రస్తుత ఈ ఉప ఎన్నిక బరిలో ఢీకొంటున్నాయి. దీంతో ఎన్నికల్లో ఇరుపక్షాల పోటీ రసవత్తరంగా మారింది. నంద్యాల నియోజవర్గం ఏర్పడ్డాక జరుగుతున్న 16వ ఎన్నికలో గెలుపు కోసం వ్యూహ, ప్రతివ్యూహాలతో ఇరు పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రచారం చేపట్టగా, శిల్పా గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటూ ప్రచారం చేశారు. టీడీపీ అభివృద్ధి మంత్రంతో దూసుకుపోతోంది. 40-50 ఏళ్ల కలగా మారిన నంద్యాల రహదారుల విస్తరణ, రూ.1100 కోట్లతో పేదలకు ఇళ్లు, తాగునీటి శాశ్వత పరిష్కారం, రహదారులు ఇలా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీపై విమర్శల అస్త్రాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగిస్తోంది. గురువారం నంద్యాలలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ విజయవంతమైంది. కాగా, జెండాలు మారడంతో ఇరు కుటుంబాల అనుయాయులు, కార్యకర్తల్లాగే ఓటర్లను తమవైపు మార్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇలా ప్రతిరోజూ ఇరుపార్టీలూ సమీకరణలతో మునిగిపోతున్నాయి. గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున ఎన్ఎండీ ఫరూక్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి పోటీ చేశారు. మారిన సమీకరణల్లో భూమా, ఎస్పీవై రెడ్డి ఇరువురూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా నుంచి శిల్పా మోహన్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఫరూక్ తెదేపాలోనే ఉండటం అదనపు బలంగా అధికార పార్టీ భావిస్తోంది. నాడు భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో గెలుపు సాధించారు కనుక ఈ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా తక్కువ మెజార్టీతోనైనా గెలుపు ఖాయం అన్న ధీమాతో ప్రచారం సాగిస్తున్నారు. టీడీపీ మాత్రం 40-50 వేల మెజార్టీతో గెలుపు సొంతం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది.