జీఎస్టీ.. వారికి షాక్: ధరలు పెరిగేవి, తగ్గేవి..
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కింద సామాన్యుడికి పెద్ద ఊరట. నిత్యావసర వస్తువుల ధరలు పెరగవు. అదే సమయంలో పాన్ మసాలా, గుట్కా వంటి వాటితో పాటు ఖరీదైన కార్ల ధరలు పెరుగుతాయి.
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కింద సామాన్యుడికి పెద్ద ఊరట. నిత్యావసర వస్తువుల ధరలు పెరగవు. అదే సమయంలో పాన్ మసాలా, గుట్కా వంటి వాటితో పాటు ఖరీదైన కార్ల ధరలు పెరుగుతాయి.
ఆహార ధాన్యాల ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఉన్న పన్నులను ఎత్తివేయాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. గురువారం శ్రీనగర్లో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ప్రారంభమైన ఈ మండలి రెండు రోజుల సమావేశంలో తొలుత ఆరు వస్తువులు మినహా మిగిలిన 1,211 వస్తువులపై విధించనున్న పన్నులను ఖరారు చేశారు.
వీటిపై ఈ రోజు నిర్ణయం!
బంగారం, పాదరక్షలు, బ్రాండెడ్ వస్తువులు, బీడీలు, ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు, సేవలపై పన్నులను శుక్రవారం జరిగే చర్చల్లో ఖరారు చేస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు.
ఏడు శాతం వస్తువులకు ఎటువంటి పన్ను లేదని జైట్లీ తెలిపారు. 14 శాతం వస్తువులపై అయిదు శాతం పన్ను ఉందని, 17 శాతం వస్తువులు 12 శాతం పరిధిలో ఉన్నాయని, 43 శాతం వస్తువులకు 18 శాతం పన్ను శ్రేణి వర్తిస్తుందన్నారు.
19 శాతం వస్తువులపై మాత్రమే 28 శాతం పన్ను
కేవలం 19 శాతం వస్తువులపై మాత్రమే 28 శాతం పన్ను విధిస్తున్నట్టు జైట్లీ తెలిపారు. అంటే 81 శాతం వస్తువులపై 18 శాతం అంతకన్నా తక్కువగా పన్ను ఉంటుందన్నారు. చాలా వస్తువులపై ఇప్పటి వరకు 31 శాతం పన్ను ఉండగా, ప్రస్తుతం గరిష్ఠంగా 28శాతం విధిస్తున్నామన్నారు.
దీంతో ద్రవ్యోల్బణం పెరిగే సమస్యే లేదన్నారు ఏ వస్తువుపైనా పన్ను పెంచకపోవడం కీలక నిర్ణయమన్నారు. పలు స్థాయిల్లోని పన్నులను రద్దు చేయడం వల్ల చాలా వస్తువులపై పన్ను భారం తగ్గిందన్నారు.
చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ఫలితంగా పన్నుల ఎగవేత అదుపులోకి వస్తుందని, ఆదాయ ప్రవాహం బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేనిపై ఎంత అంటే...
కార్లపై 28 శాతం పన్ను ఉంటుంది. పెద్ద పెద్ద కార్లు, 1500 సీసీ కంటే ఎక్కువగా ఉన్నవి, ఎస్యూవీ (4ఎం కంటే పెద్దవి) వంటి కార్ల ధరలు పెరగనున్నావి. వీటిపై 15 శాతం సెస్ విధించనున్నారు. అలాగే 350 సీసీ బైకుల పైన 3 శాతం సెస్ విధించనున్నారు. ఏసీలు రిఫ్రిజిరేటర్లపై 28 శాతం పన్ను వసూలు చేస్తారు.
వీటి ధరలు తగ్గనున్నాయి
బియ్యం, గోధుమలు, ఇతర ఆహారపదార్థాలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు వీటిపై వ్యాట్ వసూలు చేస్తున్నాయి. పాలు, పెరుగుపై పన్ను వేయలేదు. పప్పు దినుసుల పైనా పన్ను వేయలేదు. అయితే బ్రాండ్ పేర్లతో వాటిని ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
నిత్యం ఉపయోగించే సబ్బులు, టూత్ పేస్టు, షాంపుల వంటి వాటిపై 18 శాతానికి పన్నును పరిమితం చేశారు. ప్రస్తుతం వీటిపై 22-24 శాతం మేర పన్ను ఉంది. అంటే వీటి ధరలు తగ్గనున్నాయి. బొగ్గుపై పన్ను భారీగా తగ్గింది. ఇప్పటి వరకు 11.69 శాతం ఉండగా, దానిని ఇప్పుడు 5 శాతానికి పరిమితం చేశారు.
స్వీట్లపై..
స్వీట్ల పైన అయిదు శాతం పన్ను వేశారు. చక్కెర, టీ, కాఫీ, వంట నూనెలపై 5 శాతం పన్ను ఉంటుంది. ప్రస్తుతం కూడా వీటిపై ఇలాగే ఉంది. ప్రాణధార మందులపై అయిదు శాతం మాత్రమే పన్ను ఉండనుంది.