డ్రగ్స్ కబంధ హస్తాల్లో పంజాబీలు
శౌర్య ప్రతాపాలకు మారుపేరు సిక్కులు. వారు అత్యధికంగా జీవిస్తున్న పంజాబ్ రాష్ట్రం దాయాది దేశమైన పాకిస్థాన్ కుట్రలకు నిలయంగా మారింది. సరిహద్దు ఆవల నుంచి ఇబ్బడిముబ్బడిగా డ్రగ్స్ కుమ్మరించి.
చండీగఢ్: శౌర్య ప్రతాపాలకు మారుపేరు సిక్కులు. వారు అత్యధికంగా జీవిస్తున్న పంజాబ్ రాష్ట్రం దాయాది దేశమైన పాకిస్థాన్ కుట్రలకు నిలయంగా మారింది. సరిహద్దు ఆవల నుంచి ఇబ్బడిముబ్బడిగా డ్రగ్స్ కుమ్మరించి పంజాబీ యువతకు వాటికి వ్యసనానికి గురిచేసింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ రాష్ట్రంలో వేళ్లూనుకున్న డ్రగ్స్ మాఫియాను పెకళించివేస్తామని పంజాబీలకు హామీలు గుప్పిస్తున్నది. కానీ వాస్తవ పరిస్థితేమిటంటే ఈ దుస్థితికి అన్ని పార్టీలు కారణమేనన్నది చేదు నిజం.
డ్రగ్స్ విక్రయంలో టాప్
భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా ప్రతి సంవత్సరంలోనూ డ్రగ్స్ విక్రయిస్తున్నదీ ఈ రాష్ట్రంలోనే అంటే అతిశేయోక్తి కాదు. అఖిల భారత వైద్య విజ్నాన సంస్థ (ఎయిమ్స్) అంచనాల ప్రకారం పంజాబ్ లో ఏటా సుమారు రూ.7500 కోట్ల విలువైన డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. అందులో హెరాయిన్ వాటా రూ.6,500 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిపై బాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అవగతం చేసుకోవచ్చు.
ఐఎస్ఐ సహకారం
పాకిస్థాన్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఆ దేశ నిఘా సంస్థ 'ఐఎస్ఐ' సహకారంతోనే స్మగ్లర్లు పంజాబ్ లోకి డ్రగ్స్ దిగుమతి యదేచ్ఛగా సాగిస్తున్నారు. భారతదేశాన్ని సైనిక పరంగా దెబ్బతీయడం సాధ్యం కాదని తేలిపోవడంతో పాకిస్థాన్ దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తున్నది. వ్యూహాత్మకంగా పంజాబ్లోకి వచ్చిన మత్తు పదార్థాలు ఆ రాష్ట్ర యువతను చిత్తుచేస్తూ శక్తిహీనులను చేస్తున్నాయి.
రైతుల నుంచి వ్యాపారుల వరకు..
రైతులు మొదలు చిరు వ్యాపారులు, బడా వ్యాపార వేత్తల వరకు ప్రతి ఒక్కరూ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఆర్మీలోనూ కొందరు సైనిక జవాన్లు సైతం డ్రగ్స్కు బానిసలుగా మారి బలహీనులు అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పంజాబ్ రాష్ట్ర జనాభా 2.77 కోట్ల మంది అయితే మత్తు పదార్ధాలకు బానిసలైన వారు రెండు లక్షల మందికి పైమాటే. అంటే 0.84 శాతం పంజాబీలు మత్తు పదార్థాలకు వ్యసనపరులుగా మారారని నేషనల్ డ్రగ్స్ డిపెండెన్స్ ట్రీట్ మెంట్ సెంటర్ (ఎన్డిడిటిసి) అద్యయనం నిగ్గు తేల్చింది. ఇది అక్షరాల ప్రపంచ డ్రగ్స్ వ్యసనపరులతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ.
1.23 లక్షల మంది హెరాయిన్ బాధితులు
సగటున ప్రతిరోజూ రూ.20 కోట్ల మేరకు పంజాబ్ లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. ఒక్కో వ్యక్తి డ్రగ్స్ కోసం సుమారు రూ.1400 ఖర్చుచేస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. దాదాపు 1.23 లక్షల మందికి పైగా పంజాబీలు హెరాయిన్ వాడుతున్నారని పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి సుర్జిత్ కుమార్ జ్యానీకి నివేదిక సమాచారమిది. మరి కొంత మంది ఓపియం ఇతర పదార్థాలు వినియోగిస్తున్నారని వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి. మరో 75 వేల మంది డ్రగ్స్ ఇంజక్షన్ల రూపంలో తీసుకుంటున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనివల్ల నరాలు దెబ్బతినడంతోపాటు యువత శక్తి సామర్థ్యాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తుందని అంటున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి వారిలో ఎయిడ్స్, ఇతర ప్రాణాంతక వ్యాధులు పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఇంజక్షన్ల రూపంలో మత్తు పదార్థాలు వాడుతున్న వారిలో 21.10 శాతం మంది ఎయిడ్స్ బారీన పడే ప్రమాదం ఉన్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పేర్కొంది. రాష్ట్ర రాజధాని చండీగఢ్లో 2011లో 53 కేసులు నమోదైతే 2015 నాటికి అది 140 కేసులకు పెరిగింది.
డ్రగ్స్ బారిన పడుతున్న వారిలో అత్యధికులు 18 - 35 ఏళ్ల మధ్య వయస్కులే కావడం గమనార్హం. వీరిలో 80% మంది బాధితులు డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా.. 35 శాతం మంది మాత్రమే ఉపశమనం పొందారని గణాంకాలు చెప్తున్నాయి. డ్రగ్స్ బాధితుల పునరావాసం కోసం రెడ్ క్రాస్ తదితర స్వచ్ఛంద సంస్థలు సహాయ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి.
ఆఫ్ఘన్ మీదుగా డ్రగ్స్ రవాణా
నేరుగా సరిహద్దు ఆవల నుంచి రవాణాచేస్తే దొరికిపోతామని భావించిన పాకిస్థాన్ దానికి దొడ్డిదారి ఎన్నుకున్నది. ఆఫ్ఘనిస్థాన్ మీదుగా దశాబ్దాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఈ కాలంలో కాంగ్రెస్, బిజెపి, అకాలీదళ్ అధికారంలోకి వచ్చినా పట్టించుకున్న వారే లేరు. కానీ సమస్య తీవ్రతరం కావడంతో ప్రధాన పార్టీలన్నీ 'డ్రగ్స్ రహిత పంజాబ్' నినాదాన్ని తలకెత్తుకున్నాయి. గమ్మత్తేమిటంటే గత ఏడాది పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ వైమానిక దళ స్థావరంపై దాడికి ఉగ్రవాదులు ఉపయోగించుకున్నదీ ఈ స్మగ్లర్ల నెట్వర్క్నే కావడం ఆసక్తికర పరిణామం.
డ్రగ్స్ స్మగ్లర్లు వాటిని వినియోగించే వారికి 'హోం డెలివరీ' సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చారు. దీనికి రాజకీయ పార్టీల వ్యవహార శైలే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామాల వారీగా యువత 70 శాతం మంది డ్రగ్స్ వ్యసనానికి దగ్గరయ్యారు. కుల్దీప్ అనే వ్యక్తి కెమెరా ముందు నిలబడి ఈ వాస్తవాలు చెప్పేందుకు వెనుకాడడం లేదు. 12 ఏళ్ల వయస్సులో బీడీలు, 16 ఏళ్లకు ఆల్కహాల్, 18 ఏళ్లకు డ్రగ్స్ వాడుతున్నారని చెప్పాడు. ప్రతి ఎనిమిది నిమిషాలకో డ్రగ్ ఎడిక్ట్ మరణిస్తున్నాడని బాధితులు అంటున్నారు. తమకు అధికారమిస్తే నాలుగు వారాల్లో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడతామని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇస్తున్న హామీలన్నీ.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప, ఈ మహమ్మారిని తుదముట్టించడం అంత తేలిక కాదని స్పష్టంచేస్తున్నారు.