వన్ మ్యాన్ జట్టు: ఒకే ఒక్క మొనగాడు కోహ్లీ?
ముంబై: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్కు, భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి మధ్యనే పోటీ అని తెగ ఊగిపోతూ ప్రచారాలు చేశారు. కానీ, క్రిస్ గేల్ తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగినా వెస్టిండీస్ ఆటగాళ్లు వీరోచితంగా పోరాడి భారత్ను ఓడించారు.
దాన్ని బట్టి వెస్టిండీస్ వన్ మ్యాన్ జట్టు కాదని అర్థమవుతోంది. మొత్తం ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులను పరిశీలిస్తే భారత్ మాత్రం వన్ మ్యాన్ జట్టులాగే కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ మీదనే పూర్తిగా జట్టు ఆధాపపడినట్లు కనిపిస్తోంది. దానివల్ల అతను ఒత్తిడికి గురైనట్లు కూడా కనిపించాడు. ఆ ఒత్తిడిలో అంతగా అలవాటు లేని సిక్స్లను బాదడానికి కూడా సిద్ధపడ్డాడు.
"వెస్టిండీస్ వన్ మ్యాన్ జట్టు కాదు. మ్యాచ్కు ముందు మనమంతా గేల్ వర్సెస్ కోహ్లీ అని మాట్లాడుకున్నాం. గేల్ స్కోర్ చేయలేకపోయాడు. కానీ, ఆ జట్టులో మిగతావాళ్లు విజయం కోసం తలో చేయి ఎలా వేశారో చూడండి. అదీ సమిష్ఠి కృషి అంటే. జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు హైలైట్ కావడాన్ని ఆమోదించాల్సిందే. కానీ, అదెప్పుడూ ఒక్కడి ఆటే కాకూడదు. ఇదే కరీబియన్లు నిరూపించారు" అని విండీస్ చేతిలో భారత్ ఓటమి తర్వాత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు.
ఆయన మాటలను కొట్టి పారేయడానికి ఇప్పుడు ఎవరూ సాహసం చేయబోరు. ఈ టోర్నీలో మనం ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాల్లో కోహ్లీదే కీలకపాత్ర. ఓటమిపాలైన న్యూజిలాండ్తో తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ కోహ్లీ చెలరేగాడు.
జట్టులో రోహిత్ శర్మ వంటి మ్యాచు విన్నర్లు పెరిగారని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ పరిస్థితి అలా లేదని తెలిసిపోయింది. భారత్ మొత్తం విరాట్ కోహ్లీ మీద మాత్రమే ఆధారపడిందని బోధపడుతోంది. భారత జట్టుకు విరాట్ కోహ్లీ రూపంలో సచిన్ టెండూల్కర్ లాంటి మొనగాడు దొరికాడనేది నిజమే. కానీ అది అన్ని వేళలా జట్టు విజయానికి తోడ్పడదని వెస్టిండీస్పై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచు తెలియజేస్తోంది.
ఒత్తిడికి తట్టుకుంటూ లక్ష్య ఛేదనలో టాప్క్లాస్ బ్యాటింగ్ను కోహ్లీ ప్రదర్సిస్తాడనే ఎన్నోసార్లు రుజువైదంి. కచ్చితమైన టైమింగ్తోబంతిని లాఘవంగా బౌండరీకి పంపే నైపుణ్యాన్ని కూడా అతను ప్రదర్శిస్తున్నాడు. సాంకేతికంగా ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కోహ్లీ. దానికి తోడు వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరిగెత్తగలడు.
తన ఆటతీరుతో క్రికెట్ అభిమానులనే కాదు, క్రికెట్ దిగ్గజాలను కూడా అబ్బురపరస్తున్నాడు కోహ్లీ. ఒకప్పుడు యువరాజ్ సింగ్ తురుపు ముక్కగా ఉన్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ. వెస్టిండీస్లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో కోహ్లీ ఓ వికెట్ కూడా తీశాడు.
2014 ప్రపంచకప్లో 319 పరుగులతో టాప్స్కోరర్గా నిలిచినా విరాట్ కోహ్లీకి ఆశాభంగమే జరిగింది. ఆ టోర్నమెంట్ ఫైనల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమి పాలైంది. తాజాగా పోటీల్లో కూడా కోహ్లీ 273 పరుగులు చేసి జట్టును సెమీఫైనల్ చేర్చాడు.
లీగ్ మ్యాచుల్లోనే కాదు, కీలకమైన సెమీఫైనల్లోనూ వెస్టిండీస్ బౌలింగ్ను చీల్చి చెండాడి జట్టుకు 192 పరుగుల భారీస్కోరు అందించాడు. ఈసారైనా టీ20 ప్రపంచకప్పును అందుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ, ఈ మ్యాచ్లో బౌలర్ల వైఫల్యం కోహ్లీని నిరాశ పరిచింది.