కెసిఆర్ స్వయంకృతాపరాధం
కెసిఆర్ కు ఆ పార్టీ పార్లమెంటు సభ్యురాలు ఎంతగా మద్దతు పలికినా ఫలితం కనిపించడం లేదు. కెసిఆర్ వెన్నంటే ఉన్న పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు యెన్నం శ్రీనివాస రెడ్డి తిరుగుబాటు పార్టీలో ఒక సంచలనం. ఆ తర్వాత పార్టీ ఉపాధ్యక్షురాలు ఉమాదేవి తాజాగా కెసిఆర్ పై దాడికి దిగారు. పార్టీ నాయకత్వం నుంచి కెసిఆర్ తప్పుకుంటేనే పార్టీ బాగుపడుతుందని ఆమె అన్నారు. ఇలా కెసిఆర్ ను వ్యతిరేకించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో పార్టీ తీవ్రమైన సంక్షోభంలో పడింది. ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ కెసిఆర్ పై తిరుగుబాటు చేసి ఏకంగా తెలంగాణ విమోచనా సమితిని స్థాపించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు రవీంద్ర నాయక్ ఎన్నికలు ముగిసిన వెంటనే కెసిఆర్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కెకె మహేందర్ రెడ్డి కూడా తన నిరసన గళం వినిపించారు. వీరి విమర్శలను కొట్టేసే పరిస్థితిలో కెసిఆర్ లాబీకి లేకుండా పోయింది.
కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి కూడా పూర్తి తమ నాయకుడ్ని సమర్థించే స్థితిలో లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పార్టీలో లోపాలు జరిగిన మాట నిజమేనని నాయని నర్సింహారెడ్డి అన్నారు. తాజాగా నాయని నర్సింహా రెడ్డి నివాసంలో కొంత మంది తెరాస నాయకుల సమావేశం జరిగింది. నాయని నర్సింహారెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా పలువురు నాయకులు కోరారు. దీన్ని బట్టి పార్టీలో కెసిఆర్ ఆధిపత్యానికి, నాయకత్వానికి ఎసరు వచ్చినట్లేనని భావించవచ్చు.
కెసిఆర్ పక్కన నిలిచే నాయకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ స్థితిలో కెసిఆర్ పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు. ఈ సంక్షోభం నుంచి బయట పడే మార్గం కూడా కెసిఆర్ కు కనిపిస్తున్నట్లు లేదు. యుపిఎ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చకపోవడాన్ని బట్టి కాంగ్రెసు వైఖరి ఏమిటో అర్థమవుతూనే ఉన్నది. కెసిఆర్ ఎంచుకున్న వ్యూహం వల్ల మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు పార్టీని కాపాడడానికి తగిన కార్యక్రమాలు కూడా ఏమీ లేకుండా పోయాయి. తెలంగాణవాదాన్ని నిలబెడుతూ, పార్టీని కాపాడుకోవడం కెసిఆర్ కు కష్టమే. పార్టీ నిర్మాణానికి కెసిఆర్ మొదటి నుంచి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తనను గాక ఎవరిని ప్రజలు ఎన్నుకుంటారనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తూ వెళ్లారు. అలాగే, కొంత మందిని మాత్రమే తన పక్కన చేర్చుకుని వారి మాటలనే తెలంగాణ మేధావుల మాటగా చెబుతూ వచ్చారు. ఆయనకు దూరంగా ఉన్న విస్తృతమైన తెలంగాణ మేధావులు గానీ రచయితలు గానీ కనిపించలేదు. దాంతో క్రమక్రమంగా పార్టీ పరిధి, తెరాస తెలంగాణవాద వైఖరి కుంచించుకుపోతూ వచ్చింది.
నిజానికి, తెరాసను నిలబెడుతూ వచ్చింది కెసిఆర్ కు దూరంగా ఉన్న మేధావులు, రచయితలు, ఉద్యమకారులు మాత్రమే. కానీ వారంతా వ్యతిరేకంగా పనిచేయడమో, నిష్క్రియాపరులుగా మారడమో జరిగింది. ఈ పరిణామాన్ని కెసిఆర్ గత ఉప ఎన్నికల తర్వాతనైనా గమనించలేదు. ఇది ఒక రకంగా కెసిఆర్ స్యయంకృతాపరాధం.