వైయస్ జగన్ కు మొండిచేయ్యే?

జగన్ ను ఢిల్లీ పిలుస్తామని హామీ ఇవ్వలేదని, జగన్ ను ఢిల్లీకి ఆహ్వానించినట్లు వార్తల్లో నిజం లేదని సింఘ్వీ స్పష్టంగా చెప్పారు. అలాగే, జగన్ తండ్రి బాటలో నడవాలని రోశయ్య సలహా ఇచ్చారు. పార్టీలో గొప్ప నాయకుడిగా ఎదిగేందుకు జగన్ ప్రయత్నించాలని, అందుకు ఆయన మద్దతుదారులు సహకరించాలని రోశయ్య అన్నారు. దీన్ని బట్టి జగన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే స్థాయి నాయకుడిగా కాంగ్రెసు నాయకత్వం భావించడం లేదని అర్థం చేసుకోవచ్చు.
జగన్ ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంటుందనే సంకేతాలను పార్టీ నాయకత్వం ఇస్తోంది. ఇవే మాటలను రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, కె. కేశవరావులాంటి వారు కూడా చెప్పారు. వీరు పార్టీ అధిష్టానాన్ని కాదని ఆ మాటలను అన్నారని అనుకోవడానికి లేదు. పార్టీ అధిష్టానమే వారి చేత అలా మాట్లాడించిందని భావించడానికి వీలుంది. సీనియర్లు మాట్లాడితే స్పందించని అధిష్టానం జగన్ కు పిలుపు వచ్చిందనే వార్తలను వెంటనే ఎందుకు ఖండించిందని మంత్రి కొండా సురేఖ అడగడంలో కాస్తా అమాయకత్వం కూడా కనిపిస్తోంది. లేదంటే తన భవిష్యత్తు తేలిపోయి ఏది జరిగితే అది జరుగుతుందని ఆమె మాట్లాడి ఉంటారు.
మూడు రాష్టాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ తన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని, ఈ విస్తరణలో జగన్ కు సహాయ మంత్రి పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. జగన్ కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి పార్టీ నాయకత్వలం సిద్ధంగా ఉన్నట్లు చాలా కాలం నుంచే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కెవిపి రామచందర్ రావు ఏ మేరకు ప్రయత్నాలు చేస్తారో, ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో తెలియదు.












Click it and Unblock the Notifications