కెసిఆర్ టార్గెట్ ఎన్నికలా, రాష్ట్ర సాధనా?
కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఇస్తున్న కార్యాచరణకే కెసిఆర్ చెప్పాపెట్టకుండా కట్టుబడి పనిచేస్తున్నారు. తెలంగాణ అంశంపై రెండు రోజుల పాటు లోకసభను స్తంభింపజేసిన కెసిఆర్ ఆ తర్వాత కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులకు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన హితబోధతో వెనక్కి తగ్గారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని కాంగ్రెసు అధిష్టానం చేసిన సూచనకే ఆయన కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పక తప్పదు. జూన్లోగా తమ పార్టీ అధిష్టానం తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే తామేమిటో చూపిస్తామని తెలంగాణ పార్లమెంటు సభ్యులు చెప్పారు. వారి కార్యక్రమానికే కెసిఆర్ కూడా కట్టుబడినట్లు కనిపిస్తున్నారు.
ప్రస్తుతం కెసిఆర్ తన నమస్తే తెలంగాణ పత్రికను బయటకు తేవడంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. నమస్తే తెలంగాణ పత్రికలోని జర్నలిస్టులకు ఆయనే క్లాసులు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన పత్రిక తీరుతెన్నులపై వారికి పాఠాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన నమస్తే తెలంగాణ ఆవిష్కరణ జరుగుతుందని అంటున్నారు. కానీ, అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా వెలువడలేదు. వచ్చే ఎన్నికల నాటికి పత్రిక, చానెల్ దుమ్ము రేపుతూ తనకు అండగా ఉంటాయని కెసిఆర్ అనుకుంటున్నారు. ఈలోగా వస్తే, గిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ పార్లమెంటు, శాసనసభ స్థానాలను గెలుచుకుని కాంగ్రెసు అధిష్టానం మెడలు వంచాలనే లక్ష్యమే తప్ప మరో లక్ష్యం లేదని చెబుతున్నారు.