'ఆంటోని' కన్ఫ్యూజన్: టికి బ్రేక్ పడుతుందా!?
నిన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందున ప్రక్రియను ఎన్నికల తర్వాత వరకు వాయిదా వేయాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం చేపట్టబోయే ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిపోయిందని ముఖ్యమంత్రి, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ధీమాగా ఉన్నారట. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించి వెళ్లే దాకా లేదా అఖిలపక్ష కమిటీయో, అధికారిక కమిటీయో వేసేదాకా విభజన ప్రక్రియ ఆగినట్లే అని వారు చెబుతున్నారు.
కిరణ్ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్లను కలుసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని, సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను వారి దృష్టికి తెచ్చారట. విభజనపై అసెంబ్లీ తీర్మానం ఆమోదం పొందలేని పరిస్థితి ఉందని, పార్లమెంట్లోనూ ప్రతిష్టంభన నెలకొనే అవకాశముందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రణబ్తో భేటీ అనంతరం రాత్రి 8 గంటలకు కిరణ్ హైదరాబాద్ బయలుదేరారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఉత్సాహం తెచ్చినట్లు కనిపించిందట. ఢిల్లీలో కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, జెడి శీలం, ఎంపీలు లగడపాటి, సాయి ప్రతాప్, అనంత వెంకట్రామి రెడ్డి తదితరులు కిరణ్తో భేటీ అయ్యారు. ఆంటోనీ కమిటీ ముందు బలమైన వాదనలు వినిపించిన తర్వాత విభజనపై కేంద్రం ముందుకు వెళ్లే అవకాశాలు తక్కువయ్యాయని వారు భావించినట్లు తెలుస్తోంది.
తాను మీ నిర్ణయాన్ని అమలు చేయలేనని, సమైక్యాంధ్రకు చివరి ముఖ్యమంత్రిగా ఉండాలని తాను అనుకోవడం లేదని, పార్టీ పెద్దలకు తాను చెప్పినట్లు కిరణ్ ఎంపీతో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. వర్కింగ్ కమిటీ తీర్మానం జరిగి నెల రోజులు దాటినా ఇప్పటి వరకూ ప్రక్రియ ముందుకు సాగకపోవడమే రాష్ట్ర విభజన జరగదనేందుకు ప్రబల తార్కాణమని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారంటున్నారు. తమ ప్రాంత ప్రజల ఆందోళనలు, తాము పెంచుతున్న ఒత్తిడి కారణంగానే ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొంటున్నారు.
మరోవైపు, గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆంటోనీ కమిటీ కన్ఫ్యూజన్లో పడిందని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారట. అధిష్ఠానం పరిస్థితి ముందుకు వెళ్తే గొయ్యి.. వెనక్కు వెళ్తే నుయ్యి అనే చందాన ఉందని అంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని, వాళ్ల ఆందోళనలు, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లడం కుదరదని వీరు పట్టుబడుతున్నారు. ఈ వాదనతో ఆంటోనీ కమిటీ కూడా ఏకీభవించినట్లుగా తెలుస్తోంది.
పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులను సమీక్షించి ఆంటోని నివేదిక ఇస్తారని భావిస్తున్నారు. ఇంకోవైపు, మంగళవారం ఆంటోని కమిటీతో ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతల సమావేశ తర్వాత, దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ నేతల్లో కొత్త సందేహాలకు తెరతీశాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు గౌరవమిస్తామన్న దిగ్విజయ్ వ్యాఖ్యలతో.. సంప్రదింపుల ప్రక్రియ మరింతకాలం కొనసాగి తెలంగాణ ప్రక్రియ ఆలస్యమవుతుందన్న అలజడి తెలంగాణ నేతల్లో వ్యక్తమవుతోందట.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ కేంద్ర హోంశాఖ నుంచి జరుగుతున్న ప్రచారం కూడా విభజన ప్రక్రియ ముందుకు సాగడానికి అడ్డంకిగా మారే అవకాశం ఉందని వారు అనుమానపడుతున్నారు. అయితే, ఢిల్లీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అవి సీమాంధ్రుల ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనంతో చేస్తున్నారని కానీ, విభజన ప్రక్రియ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ఆగేది లేదని సూటిగానే ఢిల్లీ పెద్దలు చెబుతున్న విషయాన్ని గుర్తించాలని కొందరు చెబుతున్నారు.