ముందు హైకోర్టు విభజన.. వద్దు అన్ని ఒకేసారి..: ఎట్ హెమ్లో చంద్రుళ్ల భేటీ
అప్పుడొకటి.. ఇప్పుడొకటి కాకుండా అన్నింటిని ఒకేసారి పరిష్కరించుకోవడం ద్వారా ఎవరికీ ఎలాంటి మనస్తాపాలు ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు.. గవర్నర్, కేసీఆర్ లకు తెలిపారు.
హైదరాబాద్: గవర్నర్ నివాసం రాజ్భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమం సందర్బంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉమ్మడి రాష్ట్రాల సమస్యలపై ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
తెలంగాణ సీఎం విజ్ఞప్తి మేరకు గవర్నర్ చొరవ తీసుకుని ఇద్దరు సీఎంల మధ్య భేటీని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఏపీ సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం విశాఖ వెళ్లాల్సి ఉండగా.. గవర్నర్ కోరడంతో ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు.
హైకోర్టు విభజనపై చర్చ:
రెండు రాష్ట్రాలు విడిపోయినా.. ఉమ్మడి సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉండటంతో సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఇద్దరు సీఎంలు చర్చించుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తొలుత హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తి.. విభజనకు సహకరించాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబును కోరారు.
అన్ని ఒకేసారి పరిష్కరించుకుంటే మేలు:
తెలంగాణ సీఎం కేసీఆర్ హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తడంతో.. ఒక్క హైకోర్టు విభజనే కాకుండా అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొనట్టు తెలుస్తోంది.
అప్పుడొకటి, ఇప్పుడొకటి కాకుండా.. అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించడం బెటర్ అని చంద్రబాబు తెలిపినట్టు సమాచారం.
గవర్నర్ కార్యాలయం లోపల భేటీ:.jpg
ఎట్ హోం కార్యక్రమం చివరలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య సమావేశం జరిగింది. గవర్నర్ కార్యాలయం లోపల ఇద్దరు సీఎంలు పలు అంశాలపై చర్చించుకున్నారు. హైకోర్టు ఉమ్మడిగా ఉండటం పాలనాపరమైన సమస్యలకు కారణమవుతోందని కేసీఆర్ చంద్రబాబుతో పేర్కొన్నారు.
మధ్యలో గవర్నర్ చొరవ:
తెలంగాణ సీఎం కేసీఆర్ హైకోర్టు అంశాన్ని ప్రస్తావించినప్పుడు.. గవర్నర్ నరసింహన్ కేసీఆర్ వాదనను సమర్థిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ సూచన చేశారు. అన్ని సమస్యలను అపరిష్కృతంగా ఉంచుకోవడం కన్నా.. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్లడమే మంచిదని సూచించారు.
హైకోర్టు విభజనకు ఒప్పుకోండి
హైకోర్టు విభజన కోసం తెలంగాణ రాష్ట్రం ఎప్పటినుంచో అడుగుతున్నందునా.. అందుకు ఏపీ ప్రభుత్వం కూడా సహకరించాలని గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. దీంతో విభజన వల్ల తలెత్తిన సమస్యలు తమనే ఎక్కువ బాధిస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
ఒకేసారి పరిష్కారమైతేనే బెటర్:
అప్పుడొకటి.. ఇప్పుడొకటి కాకుండా అన్నింటిని ఒకేసారి పరిష్కరించుకోవడం ద్వారా ఎవరికీ ఎలాంటి మనస్తాపాలు ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు.. గవర్నర్, కేసీఆర్ లకు తెలిపారు. దీంతో పాటు పదో షెడ్యూల్ సంస్థల విభజనపై మాటేమిటని, సుప్రీంకోర్టు చెప్పినా దానికి సంబంధించిన విభజన ఏదని చంద్రబాబు అడిగినట్టు సమాచారం.
చివరగా.. గవర్నర్ మాట:
ఏదేమైనా సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు పట్టువిడుపులతో వ్యవహరించవద్దని గవర్నర్ ఇరు రాష్ట్రాల సీఎంలకు సూచించారు. కాగా, సమస్యలపై మరోసారి ఇద్దరు సీఎంలు కూర్చొని విపులంగా చర్చించుకోవాలని నిర్ణయించుకున్నారు.