టిట్ ఫర్ ట్యాట్: ఎపి సిలబస్ నుంచి తెలంగాణ డిలిట్
హైదరాబాద్: పాఠ్యపుస్తకాల్లో తమ సిలబస్ను రూపొందించుకోవడానికి, ఆంధ్రప్రదేశ్కు చెందిన అంశాలను తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇందుకు కమిటీలను కూడా వేసింది. పుస్తకాలను రాయిస్తోంది. తామే తక్కువ తినలేదన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తోంది. తమ సిలబస్ నుంచి తెలంగాణ అంశాలను తొలగించే దిశగా పనిచేస్తోంది.
తెలంగాణ అంశాలను తొలగించి సిలబస్ను మార్చేసి పాఠ్యపుస్తకాలు తయారు కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో కొత్త సిలబస్న ు 2016-17 విద్యాసంవత్సరం నుంచి అమలు చేసే ఆలోచనలో ఉంది. అయితే, ఈ సంవత్సరం అత్యంత ప్రధానమైన భౌగోళిక సరిహద్దుల వంటి మార్పులు చేయడానికి సిద్ధపడింది.
తెలంగాణ సిలబస్లో మార్పు తేవడానికి, ఆంధ్రప్రదేశ్ అంశాలను తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థకు అధికారం కట్టబెట్టింది. అదే తరహాలో ఎపిఎస్ఇఆర్టి కూడా తెలంగాణ అంశాలను తొలగించి సిలబస్ను రూపొందించనుంది. ఆ కృషి గత సంవత్సరమే ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం దానికి అనుమతి గానీ, అవసరమైన నిధులను గానీ ఇవ్వలేదు.
సిలబస్ను స్థానికం చేయడానికి చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని ఎపిఎస్ఇఆర్టి వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ తెలుగు, సామాజిక శాస్త్రాల్లో పెను మార్పులు చేసే అవకాశం ఉంది. దానివల్ల తెలంగాణకు, దాని సంస్కృతికి సంబంధించిన అంశాలు సిలబస్ నుంచి మాయమవుతాయి. అయితే, తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య అంశాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిలబస్లో లేవని తెలంగాణవాదులు అంటున్నారు.