షేన్వార్న్ వర్సెస్ సామ్యూల్స్: ఇదీ గొడవ ప్లాష్ బ్యాక్!
కోల్కతా: ప్రపంచ కప్ ట్వంటీ 20 2016 కప్ ఫైనల్ గెలిచిన అనంతరం.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన మార్లోన్ సామ్యూల్స్ తన అవార్డును ఆసిస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్కు అంకితం ఇచ్చాడు. ఇది వారిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
తన పైన షేన్ వార్న్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని, కానీ తాను బ్యాట్తోనే సమాధానం చెబుతానని అంటూ సామ్యూల్స్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును షేన్ వార్న్కు అంకితం ఇస్తున్నట్లు వ్యంగ్యంగా ప్రకటించాడు. అయితే, వారిద్దరి మధ్య ఇంత రగడ జరగడానికి కారణం ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందని అంటున్నారు.
వారిద్దరి మధ్య గత పదకొండేళ్లుగా ఘర్షణ చోటు చేసుకుంటోంది. 2005లో మొదటిసారి వీళ్లిద్దరికి ఓ మ్యాచ్లో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. 2013 బిగ్ బాష్ లీగ్ సందర్భంగా అది ముదిరింది.
ఓ మ్యాచ్లో షేన్ వార్న్ కావాలనే సామ్యూల్స్ పైకి బంతి విసిరాడు. దీంతో సామ్యూల్స్ బ్యాట్ను వార్న్ పైకి విసురుగా వేశాడు. ఇది అప్పట్లో దుమారం రేపింది. షేన్ వార్న్ రిటైర్ అయ్యాక కూడా వివాదం కొనసాగుతోంది. వార్న్ వ్యాఖ్యాతగా మారాడు.
వెస్టిండీస్ ఆడిన కొన్ని మ్యాచ్ల సందర్భంగా సామ్యూల్స్ ఆటను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ప్రపంచ కప్ సెమీఫైనల్లో సామ్యూల్స్ విఫలమవడంపై విమర్శలు చేశాడు. కీలక మ్యాచ్లో ఇలా ఆడుతారా అని ఎద్దేవా చేశాడు.
వాటన్నింటిని మనసులో పెట్టుకున్న సామ్యూల్స్.. విండీస్ ఫైనల్లో గెలిచిన అనంతరం తన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ను అందుకున్న సమయంలో వార్న్కు కౌంటర్ ఇచ్చాడు. షేన్ వార్న్ తనను పదేపదే అంటున్నాడని, ఆయనకు దీనిని అంకితం ఇస్తున్నానని, తాను బ్యాట్తోనే సమాధానం చెబుతానని చురకలు అంటించాడు. అయితే, వార్న్.. విండీస్ కప్ గెలిచిన అనంతరం సామ్యూల్స్ను అభినందించడం కొసమెరుపు.