'బతుకమ్మ చీరలు' చివరికిలా?: మహారాష్ట్ర వ్యాపారులకు పండుగ, వస్తు మార్పిడి 'సేల్'!
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని పలు గ్రామాల్లో మహారాష్ట్రకు చెందిన చిరు వ్యాపారులు బతుకమ్మ చీరలను కొనుగోలు చేస్తున్నారు.
భైంసా: మహారాష్ట్ర- పూర్వ ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో వస్తు మార్పిడి పద్దతిని ఇప్పటికీ చూడవచ్చు. ఇక్కడి థాంసి, వీరూర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ వస్తు మార్పిడి పద్దతి కొనసాగుతోంది. తెలంగాణలో వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి.. చాలామంది ఇక్కడి నుంచి వరి బియ్యం వీరూర్ తీసుకెళ్లి, అక్కడి నుంచి గోధుమలను తెచ్చుకుంటుంటారు.
టీఆర్ఎస్ పరువు గంగ పాలు: బతుకమ్మ చీరలకు నిప్పు..
దసరా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు కూడా ఇప్పుడిదే తరహాలో వస్తు మార్పిడి అవుతున్నాయి. బతుకమ్మ చీరలను విక్రయిస్తూ వాటికి బదులు మరేదైనా వస్తువును కొనుక్కుంటున్నారు జనం. మహారాష్ట్ర నుంచి వచ్చే చిరు వ్యాపారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
భైంసాలో ఇలా:
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని పలు గ్రామాల్లో మహారాష్ట్రకు చెందిన చిరు వ్యాపారులు బతుకమ్మ చీరలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో బతుకమ్మ చీరలు అంగడి సరుకుగా మారిపోయాయి. మహిళల నుంచి ఈ చీరలను కొనుగోలు చేస్తూ.. వాటికి బదులుగా బుట్టలు, బకెట్లు వంటి వస్తువులను ఇస్తున్నారు.
ఒక్కో చీరకు రూ.50:
తెలంగాణ ప్రభుత్వం ఒక్కో చీరకు రూ.290వరకు వెచ్చించగా.. వస్తు మార్పిడి విధానంలో వీటికి రూ.50-రూ.60ధర మాత్రమే పలుకుతోంది. చీర ఖరీదే ఎక్కువైనప్పటికీ.. వాటికి బదులు ఏదైనా వస్తువు కొనుక్కునేందుకే వారు మొగ్గుచూపుతున్నారు. దీంతో మహారాష్ట్ర చిరు వ్యాపారుల పంట పండుతోంది.
మహారాష్ట్రలో విక్రయం:
ఇక్కడి మహిళల నుంచి కొనుగోలు చేసిన చీరలను తిరిగి మహారాష్ట్రలో విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కేవలం రూ.50కే కొనుగోలు చేసి అక్కడ మాత్రం రూ.300ధరకు వారు అమ్ముతున్నట్టు సమాచారం. దీంతో తెలంగాణ ఆడబిడ్డల కోసం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్ర మహిళల సొంతమవుతున్నాయి.
బతుకమ్మ చీరల వివాదం:
దసరా పండుగ సందర్భంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు రాష్ట్రంలో మహిళల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ప్రకటనల్లో నేతల చీరలను చూపించి.. పంపిణీలో మాత్రం నాసిరకం చీరలను అంటగట్టేసరికి.. వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చాలామంది మహిళలు రోడ్డెక్కి వాటిని తగలబెట్టారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినట్టయింది.