మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు :వ్యతిరేకతతో ఉపసంహరణ
మహత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హర్యానా మంత్రిపై స్వంతపార్టీతో సహ అన్ని పార్టీలు విరుచుకుపడ్డాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గాంధీపై చేసిన ఆరోపణలను ఆయన ఉపసంహరించుకొన్నారు.
న్యూఢిల్లీ : జాతిపిత మహత్మాగాంధీ కంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీయే మంచి బ్రాండ్ అని వ్యాఖ్యానించి హర్యానా మంత్రి అనిల్ విజ్ వివాదంలో చిక్కుకొన్నారు.ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.అన్ని పార్టీలు నాయకులతో పాటు స్వంత పార్టీ నాయకుల నుండి విమర్శలు ెదుురుకావడంతో ఈ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకొన్నారు.
''ఖాదీపై గాంధీ పేరుకేమీ పేటేంట్ లేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఖాదీకి గాంధీ పేరును లింక్ చేసినప్పటి నుండి పరిశ్రమ పతనమైపోయిందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
గాంధీ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించినప్పటి నుండి రూపాయి విలువ తగ్గడమే కాని పెరుగలేదని విజ్ వ్యాఖ్యానించారు. ఖాధీ , కుటీర పరిశ్రమల కమీషన్ తాజా కేలండర్ లో గాంధీకి బదులుగా మోదీ ఫోటో వేయడంపై వ్యక్తమైన విమర్శలకు మంత్రి స్పందించారు.
ఖాదీ వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా గాంధీ స్థానంలో మోడీ ని పెట్టడం సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వల్ల ఖాదీ వస్త్రాల విక్రయాలు పెరుగుతాయన్నారు.
హర్యానా మంత్రి వ్యాఖ్యలపై దుమారం
హర్యానా మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది.ఈ వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. ఖాదీ వస్త్రాలకు మోదీ బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తారని చెబుతూనే గాంధీని కించపరిచేలా హర్యానా మంత్రి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసిన హర్యానా మంత్రి వివాదంలో చిక్కుకొన్నాడు.
వ్యంగ్యాస్త్రాలు సంధించిన రాహుల్
హర్యానా మంత్రి గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.హిట్లర్, ముస్సోలినీ కూడ శక్తివంతమైన బ్రాండ్లేనని ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు.గాంధీని చంపగలిగారు, కాని, ఆయన పోటోలు మాత్రం తీసివేయలేకపోయారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా చెప్పారు.
మంత్రి వ్యాఖ్యలపై గాంధీ మునిమనమడి ఆగ్రహం
హార్యానా మంత్రి గాంధీని కించపర్చేలా చేసిన వ్యాఖ్యలపై గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ స్పందించారు. పార్టీ అధిష్టానం చెప్పినట్టుగానే హర్యానా మంత్రి వింటున్నారని, ఆర్ ఎస్ ఎస్ బాషను వాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ రకమైన వ్యాఖ్యలు సరికాదని ఆయన చెప్పారు.
నష్టనివారణను ప్రారంభించిన బిజెపి
హర్యానా మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి.అయితే ఈ వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కల్గించే అవకాశం ఉందని భావిస్తోంది బిజెపి. ఈ మేరకు నష్టనివారణ చర్యలకు పూనుకొంది. హర్యానా మంత్రి విజ్ చేసిన వ్యాఖ్యలను బిజెపి ఖండించింది.ఈ వ్యాఖ్యలు పార్టీతో సంబంధం లేవన్నారు. ఈ వ్యాఖ్యలు మంత్రి వ్యక్తిగతమైనవిగా ఆ పార్టీ తేల్చి చెప్పింది.
వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకొన్న మంత్రి
హర్యానా మంత్రి విజ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవిగా బిజెపి తేల్చి చెప్పింది.ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ మీడియాకు తెలిపారు. హార్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడ ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇతరపార్టీలతో పాటు, స్వంత పార్టీ నుండి కూడ తనపై ఎదురుదాడి జరగడంతో విజ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొన్నారు. తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకొంటే క్షమించాలని ఆయన కోరాడు.