కొడుకుల కోసం ‘దేశీ గర్ల్స్’ వేట: ఆ అమ్మాయిలు వద్దని రబ్రీ షరతులు!
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులకు కాబోయే సతీమణుల అన్వేషణ మొదలైంది. వారి కోసం అచ్చమైన గ్రామీణ అమ్మాయిలను చూస్తున్నట్టు లాలూ సతీమణి రబ్రీదేవి చెప్పారు.
బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్వి ప్రసాద్ యాదవ్లకు వివాహ సమయం దగ్గర పడిందని భావించిన ఆమె.. వారి కోసం మంచి సాంప్రదాయమైన అమ్మాయిల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అంతేగాక, తమకు కోడళ్లుగా వచ్చే అమ్మాయిలు మాల్స్కు వెళ్లే వారు కాకూడదని షరతు కూడా పెట్టుకున్నారు రబ్రీ దేవి.
ఆదివారం లాలూ నివాసంలో ఆయన 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రబ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలకు, మాల్స్కు, షికార్లకు వెళ్లే అమ్మాయిలు నచ్చరని పేర్కొన్నారు.
తన తర్వాత ఇంటిని జాగ్రతగా చూసుకునే అమ్మాయిలు కావాలని, పెద్దలను గౌరవించగలగాలని స్పష్టం చేశారు. అంతేగాక, తనలాగా బయట పనులను కూడా చక్కదిద్దుకునే అమ్మాయిలే తనకు కోడళ్లుగా సరిపోతారని రబ్రీదేవి తెలిపారు.