జిఎస్టి ఎఫెక్ట్: టిటిడి డైరీ, క్యాలెండర్ ధరల పెంపు
తిరుమల: జిఎస్టి ప్రభావం అన్ని రంగాలపై కన్పిస్తోంది. ఆపద మొక్కుల వాడిగా పేరున్న వెంకటేశ్వరస్వామి దేవాలయంపై కూడ ఈ ప్రభావం కన్పిస్తోంది. లడ్డూలపై ఈ భారాన్ని ఎత్తివేయాలని టిటిడి కోరికను ప్రభుత్వం మన్నించింది.టిటిడి ప్రతి ఏటా ముద్రించే డైరీ, క్యాలెండర్ల ధరలను వచ్చే ఏడాది నుండి పెంచనున్నట్టు టిటిడి ప్రకటించింది.
వస్తు సేవల పన్ను భారం తిరుమల వెంకటేశ్వరుని భక్తులు ఎంతగానో ఇష్టపడే స్వామివారి క్యాలెండర్, డైరీలపై పడింది. వచ్చే సంవత్సరం క్యాలెండర్, డైరీల ధరలను భారీగా పెంచక తప్పడం లేదని టీటీడీ పేర్కొంది.
ఆయిల్ ప్రింటింగ్తో , నాణ్యంగా వీటిని ముద్రిస్తారు. 12 పేజీల శ్రీవారి క్యాలెండర్ ధరను రూ. 75 నుంచి 90కి పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రూ. 100గా ఉండే డైరీ ధరను రూ. 120కి పెంచుతున్నట్టు ప్రకటించారు.
మరో వారంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు, ఈ నెల 23న తిరుమలకు వచ్చే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు వీటిని ఆవిష్కరించనున్నారు.ఆ తరువాత వీటిని భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచనున్నారు. జిఎస్టి ప్రభావం వల్లే డైరీలు, క్యాలెండర్ల ధరలను పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టిటిడి ప్రకటించింది.