జయలలిత కోసం ఆసుపత్రికి దత్తపుత్రుడు: నో అన్న పోలీసులు, ఉద్రిక్తత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న చెన్నైలోని అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. జయలలితను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన దత్త పుత్రుడు సుధాకరణ్ పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో అపోలో ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇదే సమయంలో సుధాకరణ్ను లోపలికి అనుమతించాలంటూ ఆయన అనుచరులు పోలీసులను వేడుకున్న అందుకు వారు అంగీకరించలేదు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అనుమతి వస్తేనే సుధాకరణ్ను లోపలికి పంపుతామని పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు.
దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో సుధాకరణ్ను ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. దీంతో జయలలితను పరామర్శించకుండానే ఆసుపత్రి నుంచి సుధాకరణ్ వెళ్లిపోయాడు. గతంలో సుధాకరణ్ ఓ డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో అతనితో నాకు ఎటువంటి సంంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు.
అప్పటి నుంచి సుధాకరణ్ను జయ దూరంగా పెట్టారు. అనారోగ్య కారణంగా సెప్టెంబర్ 22న నుంచి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సుధాకరణ్ గురువారం జయలలితను పరామర్శించేందుకు ఆసుపత్రికి రావడంతో అరగంట నుంచి గేటు బయటనే నిలిపివేశారు.
మరోవైపు జయను చూసేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు సైతం పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పోలీసులు మాత్రం ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. కాగా, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ను కూడా ఆసుపత్రి లోపలికి అనుమతించలేదు. 'అమ్మ' ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు మంత్రులు, అన్నాడీఎంకే నాయకులు అపోలో ఆస్పత్రికి వస్తున్నారు.
జయలలితకు చికిత్స అందించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం గురువారం ఉదయం చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకుంది. మరోవైపు జయలలిత ఆరోగ్యంపై ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
జయలలిత హెల్త్ బులిటెన్ విడుదల
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో అసుపత్రి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జయలలిత ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని, అయితే మరికొన్ని రోజులు ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని అందులో పేర్కొన్నారు.
జయలలితకు షుగర్, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స, కొన్ని పరీక్షలతో పాటు స్కానింగ్ కూడా నిర్వహించామని ఆ హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ఆమెకు శ్వాసక్రియ సపోర్ట్తో పాటు అవసరమైన యాంటీబయాటిక్స్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం జయ అనారోగ్యం పాలవడానికి గల కారణాలను కనుగొన్నారు.