పవిత్ర కార్తీక పౌర్ణమి నాడే చంద్ర గ్రహణం: ఈ జాగ్రత్తలు పాటించక తప్పదంటోన్న పండితులు
పవిత్ర కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి హిందూ శాస్త్రాల ప్రకారం.. ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శివాలయాల్లో జ్వాలాతోరణాలు వెలుస్తుంటాయి. ఆకాశ దీపాలను వెలిగిస్తుంటారు భక్తులు. శైవ, వైష్ణవాలయాలన్నీ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగే రోజు అది. అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తుంటారు. ఉపవాసం ఉంటారు. మహా శివుడికి లక్షబిల్వార్చన, లక్షవత్తులు, లక్షరుద్ర పూజలను నిర్వహిస్తారు. మహా శివరాత్రికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. అదే స్థాయిలో కార్తీక పౌర్ణమి నాడు తమ భక్తి ప్రపత్తులను చాటుతుంటారు.
చంద్ర గ్రహణంతో కలిసి వచ్చిన
ఈ శుక్రవారమే కార్తీక పౌర్ణమి. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి.. చంద్ర గ్రహణంతో కలిసి వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఇది రెండో చంద్ర గ్రహణం. ఇదివరకు మే 26వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12:48 నిమిషాలకు చంద్ర గ్రహణం ఆరంభమౌతుంది. సాయంత్రం 4:17 నిమిషాల వరకు కొనసాగుతుంది. గ్రహణ కాలం 3 గంటల 28 నిమిషాల పాటు ఉంటుంది.
భారత్లో ఎక్కడ కనిపిస్తుంది..
ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఇంత సుదీర్ఘకాల పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడటం 580 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. భారత్లో ఈ చంద్రగ్రహణం ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈశాన్యం వైపు మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. నార్తరన్ యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహా సముద్రం ప్రాంతంలో మాత్రమే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూసే వీలు ఉంది.
గ్రహణ కాలంలో చేయకూడనివి..
గ్రహణ కాలంలో కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు స్పష్టం చేస్తోన్నారు. గ్రహణ కాలంలో ఆహారాన్ని తీసుకోకూడదు. భోజనం చేయకూడదు. నిద్ర పోకూడదు. గ్రహణం ఆరంభం కావడానికి ముందు వండిన ఆహార పదార్థాలు గ్రహణ కాలం ముగిసిన తరువాత తినకూడదు. గ్రహణానికి ముందు నూనె, నెయ్యితో వండిన పదార్థాలపై దర్భను ఉంచాలి. నిత్యావసర వస్తువుల్లో దర్భం ముక్కలను ఉంచాలి. దీనివల్ల గ్రహణ దోషం వాటికి పట్టదు.
గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..
గ్రహణ సమయంలో గర్భిణీలు బయట తిరగకూడదు. ఆ వెలుగు తమ శరీరం మీద పడకుండా జాగ్రత్త పడాలి. గ్రహణం నీడ గానీ, వెలుతురు గానీ ప్రసరించకూడదు. చంద్ర గ్రహణానికి, సూర్యగ్రహణానికి ఈ నియమం వర్తిస్తుంది. ప్రత్యక్షంగా చూడ కూడదు. మనస్సులో భవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఆహారాన్ని స్వీకరించాలి. గ్రహణ కాలం ముగిసిన తరువాత ఆభ్యంగన స్నానం తప్పనిసరిగా చేయాలి.
ఇంట్లో పూజలు ఎలా చేయాలి..?
గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవుడి పటాలను శుద్ధి చేసుకోవాలి. విగ్రహాలు గానీ, యంత్రాలను గానీ పూజించే ఆచారం ఉన్నవారు పంచామృతంతో సంప్రోక్షణ చేయాలి. జంద్యం వేసుకున్న వారు దాన్ని తప్పకుండా మార్చుకోవాలి. నరదృష్టి తొలగిపోవడానికి నివాసాలు, దుకాణాల ముందు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసి వేసి, కొత్త వాటిని అమర్చుకోవాలి. సంప్రదాయబద్ధంగా పూజాదికాలను ముగించుకోవాలి.