పార్టీపై బిజెపి నరేంద్ర నిప్పులు
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎన్ని త్యాగాలకైనా వెనుకాడబోమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోక్సభ సభ్యుడు ఎ. నరేంద్ర, ఆలంపూర్ శాసనసభ్యుడు రావుల రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బిజెపి కార్యకర్తల అభీష్టం మేరకు కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పుచేతల్లో నడుస్తోందని వారువిమర్శించారు. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా వారు నల్లగొండలో బుధవారం బిజెపి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణకుమిగిలింది అర్థాకలి, ఆకలి చావులేనని నరేంద్ర అన్నారు. చంద్రబాబు పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆయనవిమర్శించారు.
ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు పేరుతో 1997లో కాకినాడ బిజెపి కార్యవర్గ సమావేశంలో తీర్మానాన్ని అమలు చేయాలని మాత్రమే తాము అడుగుతున్నామని, పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా తాము వ్యవహరించడం లేదని ఆయన చెప్పారు. పార్టీకి వెన్నెముకగా నిలిచిన తెలంగాణ నాయకత్వాన్ని అణగదొక్కే కుట్ర పన్నుతున్న ఆంధ్ర నాయకులపై ఈ ప్రాంత కార్యకర్తలు సింహగర్జన చేయాల్సిన సమయం వచ్చిందని నరేంద్ర అన్నారు. ఎన్డిఎలో భాగస్వామి కాని తెలుగుదేశం పార్టీకి భయపడి తెలంగాణ ఎజెండాను పార్టీ పక్కకుపెట్టాలని చూడడం దారుణమని ఆయన అన్నారు. వాజ్పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగాలనే ఉద్దేశంతోనే తాను పార్టీకి కాకుండా పార్టీ పదవికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. బిజెపి నాయకులు చెబుతున్నట్లు 2004 వరకు తెలంగాణ ఎజెండాను పక్కన పెడితే ఇక్కడ పార్టీమిగలదని ఆయన అన్నారు.
విద్య, ఉద్యోగ, ఉపాధి, నీటి పారుదల రంగాల్లో తీవ్ర అన్యాయానికిగురైన తెలంగాణను ఇప్పటికైనా ఆంధ్ర పాలకుల నుండి కాపాడుకోవాలని, లేకుంటే ఆంధ్రకు భారీ ప్రాజెక్టులు తెలంగాణకు ఇంకుడు గుంతలుమిగులుతాయని ఆలంపూర్ శాసనసభ్యుడు డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.