విభజన ఇప్పుడే కాదని సోనియా చెప్పారు: నేదురుమల్లి
రాష్ట్రంలో పరిస్థితులన్నింటినీ వివరించి, సీమాంధ్ర ప్రజలకు భరోసా కల్పించే ప్రకటన చేయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో తీర్మానం పాస్ అయ్యే పరిస్థితి లేనప్పుడు మీరెందుకు ఆందోళన చెందుతారని ఆమె ప్రశ్నించినట్లు తెలిపారు. తాను ఎటువైపూ ఏమీ చేయలేదని ఆమె అన్నట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మొదటి అడుగే ముందుకు పడనప్పుడు ఉద్యమాల ద్వారా రాష్ట్రంలో అశాంతి సృష్టించాల్సిన అవసరం ఏముందని సోనియా ప్రశ్నించినట్లు చెప్పారు.
పరిస్థితులు మరింత సంక్లిష్టం కాకుండా అందరూ శాంతించాలని, ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, ప్రజలకు నచ్చజెప్పాలని ఆమె సూచించారన్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి కృషి చేయాలని, ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేడమ్ కోరినట్లు వెల్లడించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన జరగదని కూడా అధినేత్రి చెప్పినట్లు తెలిపారు.
మొదటి అడుగే ముందుకు పడలేదు కాబట్టి చిదంబరం చెప్పిన ప్రక్రియ ప్రారంభం కానట్లేనని నేదురుమల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు సద్దుమణగడానికి కోర్ కమిటీ సభ్యుల ద్వారా ఏదో ఒక ప్రకటన ఇప్పించాలని సోనియాను కోరినట్లు చెప్పారు. దాన్ని పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనను కాంగ్రెస్లోని కొంత మంది నాయకులు, శాసనసభ్యులు అపార్థం చేసుకున్నారన్న బాధ ఆమెలో ఉందని చెప్పారు. ఈ పరిణామాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందనే ఆవేదనను అధినేత్రి వ్యక్తం చేసినట్లు తెలిపారు.