తెలంగాణ జెఎసిలో టిడిపి చేరాలి: జానా
తాము తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వలేదని, ఈ నెల 29వ తేదీ తర్వాత నిరవధిక బంద్ పాటిస్తామని కూడా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తాము తిరిగి పిలుపు ఇచ్చేవరకు ఏ విధమైన బంద్ లు పాటించకూడదని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యమంలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడకూడదని ఆయన కోరారు. అస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కూడా ఆయన కోరారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, అది మంచిది కాదని, నాయకులను అవమానించే పద్ధతిలో వ్యవహరించకూడదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెసు అధిష్టానం వెనక్కి పోలేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనలో స్పష్టత లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో స్పష్టత కావాలని, ప్రక్రియ ప్రారంభంలో జాప్యం జరగకూడదని ప్రజలు కోరుతున్నారని, దాని కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని, తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు తాము కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించే బాధ్యత తమదేనని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి చెప్పారు.