రోశయ్యకు కలిసొచ్చిన తుఫాను
రోశయ్య ప్రభుత్వంపై కరుడు గట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఏ విధమైన విమర్సలు చేయలేని పరిస్థితి ఉంది. తుఫాను తాకిడి ముప్పు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం చాలా ముందు జాగ్రత్త చర్యతో వ్యవహరించింది. తుఫాను తాకిడి హెచ్చరికలు వచ్చిన వెంటనే రోశయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా కదిలించారు. మంత్రులు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. మంత్రులు వెంటనే జిల్లాలకు తరలి వెళ్లారు. ఇంతకు ముందు వరదలు ముంచెత్తినప్పుడు ప్రభుత్వంపై వచ్చిన తీవ్రమైన విమర్శలను దృష్టిలో పెట్టుకుని రోశయ్య వేగంగా కదిలి చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెడుతుందనే విమర్సల నుంచి కూడా ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించింది. తుఫాను తాకిడి వల్ల ప్రతిపక్షాలు, స్వపక్షం వారు రోశయ్య ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన అస్త్రాలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.