ఆంధ్రప్రదేశ్ ముక్కలకు ఒప్పుకోం: సీమాంధ్ర నేతలు
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ప్రతిపాదనను అమలు చేయాలని సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా విభజన ఉద్యమాలు వస్తాయని వారు హెచ్చరించారు. రాష్ట్రాన్ని కూడా ముక్కలు చేయాల్సి వస్తుందని వారన్నారు. దళిత ఆంధ్రప్రదేశ్, సామాజిక తెలంగాణ, గిరిజన రాష్ట్రం ఏర్పాటు వంటి డిమాండ్లు తలెత్తుతాయని వారన్నారు. సమైక్యరాష్ట్రంలోని అభివృద్ధి సాధ్యమవుతుందని వారన్నారు. వేర్పాటువాదుల ఒత్తిళ్లకు తలొగ్గవద్దని వారు పార్టీ అధిష్టానాన్ని కోరారు. తమ వాదనలు వినిపించడానికి ఈ రోజు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ను, రేపు కేంద్ర మంత్రులు చిదంబరాన్నీ ప్రణబ్ ముఖర్జీనీ కలుస్తామని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కూడా కలుస్తామని వారు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు తర్వాత 2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు అర్థం లేదని వారన్నారు.