బాబుతో బర్దన్ బేటీ: ఉప ఎన్నికల్లో టిడిపికి మద్దతు?
కరీంనగర్లో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడానికి హైదరాబాదు వచ్చిన బర్దన్ సోమవారం సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాము ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని బర్దన్ చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలుగుదేశం పార్టీతో తమకు మంచి సంబంధాలున్నాయని, భవిష్యత్తులో కూడా ఆ సంబంధాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. దీన్నిబట్టి తెలంగాణలోని ఆరు స్థానాలకు, కొవ్వూరు సీటుకు జరిగే ఉప ఎన్నికల్లో సిపిఐ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.
రెండు స్థానాల్లో సిపిఎం పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ స్థానాల్లో సిపిఎంను బలపరిచి మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనేది సిపిఎం అంతర్గత వ్యవహారమని, తాను దాని గురించి మాట్లాడబోనని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. సిపిఐ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే విషయంపై మహాసభల్లో ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. సిపిఐ, సిపిఎం జాతీయ నేతలు హైదరాబాదు వచ్చినప్పుడు చంద్రబాబును కలవడం ఆనవాయితీగా వస్తోంది.