రాష్ట్రపతి ఎన్నికలలో పదనిసలు: జగన్కోసం నేతల క్యూ

ఓటింగ్ సందర్భంగా కొన్ని 'వి'చిత్రాలు చోటు చేసుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు బాలరాజు కాంగ్రెసు ఎమ్మెల్యే రాజేష్తో కలిసి ఒకే కారులో అసెంబ్లీకి ఓటు వేసేందుకు వచ్చారు. ఎన్నికలకు టిడిపి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి చిన్నం రామకోటయ్య, కొడాలి నాని, వేణుగోపాల చారి, హరీశ్వర్ రెడ్డి, బాలనాగి రెడ్డిలు ఓటు వేశారు. వీరంతా టిడిపి అసంతృప్త ఎమ్మెల్యేలు కావడం గమనార్హం.
వీరిలో నానిపై ఇప్పటికే టిడిపి సస్పెన్షన్ వేటు వేసింది. రామకోటయ్యపై చర్యలకు సిద్ధంగా ఉంది. చిన్నం మంత్రి పార్థసారథితో కలిసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగన్కు జై కొట్టిన కాంగ్రెసు ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా మెడలో వేసుకొని వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన అందరు ప్రజాప్రతినిధులు ఓటు వేసి వెళుతుండగా జగన్ పార్టీ నేతలు మాత్రం జైలు నుండి జగన్ వచ్చే వరకు ప్రాంగణంలో నిరీక్షించారు. ఆయన రాగానే అందరూ కలిసి లోనికి వెళ్లి ఓటు వేసి వచ్చారు.
జగన్ కాసేపు తల్లితో మాట్లాడారు. నేతలతో అసెంబ్లీలోకి వెళుతూ బయటకు వస్తూ మాట్లాడారు. అంతకుమించి ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే ఆయనకు విషెస్ చెప్పేందుకు నేతలు మాత్రం ఆయన వెళ్లే దారిలో పలువురు నిలబడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జగన్ కోసం వెయిట్ చేస్తుండగా, ఆయన కంటే ముందే జైలు నుండి బయలుదేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వచ్చారు. దీంతో జగన్ పార్టీ నేతలు ఆయనను క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తర్వాత మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఆయనను పలకరించారు.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి జగన్ పార్టీ నేతలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఉత్తర ప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ తొలుత పిఏ సంగ్మాకు ఓటు వేయబోయారు. అనంతరం నాలుక్కర్చుకొని మరో కొత్త బ్యాలెట్ తీసుకొని ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారు. గుజరాత్ బిజెపి శాసనసభ్యుడు కాను కలాసరియా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారు.
ఒరిస్సాలో బిజూ జనతా దళ్(బిజెడి) శాసనసభ్యుడు ప్రభాత్ బిశ్వాల్ ఓటును ఎన్నికల అధికారి తిరస్కరించారు. అతను ఓటు వేసిన అనంతరం ఎవరికి ఓటేశాడో బహిర్గత పర్చినందుకు ఆయన ఓటును తిరస్కరించారు. విజయనగరం జిల్లా ఎమ్మెల్యే అప్పలనాయుడు తొలి ప్రాధాన్యత ఓటును ప్రణబ్కు వేయాల్సి ఉండగా.. తడబాటులో సంగ్మాకు వేశారు. అనంతరం సర్దుకొని కొత్త బ్యాలెట్ తీసుకొని దాదాకు ఓటేశారు.
జైలు నుండి వచ్చిన జగన్ తన పార్టీ నేతలతో మాట్లాడేందుకు అవకాశమివ్వాలని జైలు అధికారులను కోరారు. అయితే అధికారులు మాత్రం నిబంధనలు ఒప్పుకోవని నిరాకరించిట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications