పార్లమెంటు ముట్టడి: బాబా రామ్దేవ్ అరెస్టు
అంతకు ముందు బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, జెడి (యు) అధ్యక్షుడు శరద్ యావద్ బాబా రామ్దేవ్కు సంఘీభావం తెలిపారు. వారి రామ్దేవ్తో వేదికను పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు కూడా ఆయన సంఘీభావం పలికారు. రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు బాబా రామ్దేవ్ను, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
దాదాపు 5000 మందితో రామ్దేవ్ పార్లమెంటు వైపు నడిచారు. పోలీసులు 300 నుంచి 400 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తమకు హింసను వ్యాపించజేసే ఉద్దేశం లేదని, తమను పోలీసులు ఆపారని, చట్టాన్ని గౌరవిస్తామని, పోలీసులు కేంద్ర ప్రభుత్వం కీలు బొమ్మలని రామ్దేవ్ అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పారు.
నల్లధనంపై దీక్ష చేస్తున్న యోగాగురు బాబా రామ్దేవ్ చలో పార్లమెంటుకు సోమవారం ఉదయం పిలుపునిచ్చారు. నల్లధనానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం కావాలని ఆయన సోమవారం ఉదయం తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. మూగ, చెవిటి ప్రభుత్వాన్ని కదిలించేదందుకు పార్లమెంటుకు మార్చ్ చేద్దామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని బహిష్కరించాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఓటు వేయవద్దని ఆయన సూచించారు. పార్లమెంటు మార్చ్కు రామ్దేవ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద యెత్తున బలగాలు మోహరించాయి. జైలులో రామ్దేవ్ తన దీక్షను విరమించే అవకాశాలున్నాయి. తదుపరి మహా విప్లవం కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని రామ్దేవ్ తన మద్దతుదారులకు చెప్పారు.