వరదలు: తెలియని 81 మంది ఆంధ్రా భక్తుల ఆచూకీ
హైదరాబాద్: ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్కు చెందిన భక్తులలో ఇంకా 81 మంది ఆచూకీ లభించలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్ ఇందుకు సంబంధించిన వివరాలను పొందుపర్చింది. ఉత్తరాఖండులో అచూకి లభించని వారి ఫోటోలతో పాటు వారి చిరునామాను, బంధువుల ఫోన్ నెంబర్లను పొందుపర్చారు.
రాష్ట్రానికి చెందిన పది జిల్లాల భక్తుల అచూకీ లభించలేదు. వీరు కేదార్నాత్, గౌరికుండ్ ప్రాంతాల్లో మిస్ అయినట్లుగా భావిస్తున్నారు. అందులో 33 మంది రంగారెడ్డి జిల్లా నుండి, 14 మంది కృష్ణా, 8 మంది హైదరాబాద్, 5 గురు చిత్తూరు, 5గురు విశాఖపట్నం, నలుగురు గుంటూరు, నలుగురు కడప, ముగ్గురు అనంతపురం, ముగ్గురు పశ్చిమ గోదావరి, ఇద్దరు నిజామాబాద్ జిల్లాల నుండి వెళ్లిన వారి ఆచూకి లభించలేదు.
వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనా సమాచారం ఉంటే బంధువులకు చెబుతామని డిసాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు చెబుతున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుండి 2,785 మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు వెళ్లారు. అందులో 13 మంది మృతి చెందారు. మిగిలిన వారు ఇంటికి తిరిగి వచ్చారు. డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నాలుగు వేల మంది భక్తుల ఆచూకీ లభించలేదన్నారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం అచూకీ లభించని వారి సంఖ్య 11,600గా చెబుతున్నారు.