దిల్షుక్నగర్ పేలుళ్ల కేసులో పురోగతి: ఇద్దరి గుర్తింపు
దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల సంఘటనకు పాల్పడిన ఓ ఉగ్రవాదిని స్పష్టంగా గుర్తించామని, అతని ఫొటోను ఇతర రాష్ట్రాలకు పంపించామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి ఆ మధ్య చెప్పిన విషయం తెలిసిందే. దిల్షుక్నగర్ జంట పేలుళ్లకు సంబంధించి తాము ముగ్గురిని గుర్తించామని ఆయన చెప్పారు. ఆ ముగ్గురిలో ఒకతను స్పష్టంగా కనిపిస్తున్నాడని ఆయన అన్నారు. వారు సైకిళ్లు అక్కడ పెట్టిన మూడు నిమిషాల్లోనే బాంబులు పేలాయని ఆయన చెప్పారు.
పోలీసులు సైకిళ్లు, అద్దె ఇళ్లపై దృష్టి కేంద్రీకరించారు. నిందితులు సైకిళ్లను ఎలా సమకూర్చుకున్నారు? ఎక్కడ మకాం వేశారు? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. సిసి కెమెరాల్లో నిందితులు, అనుమానితులు, సానుభూతిపరుల కదలికల్ని సమీక్షిస్తున్నారు. పేలుడుకు కొద్ది రోజుల ముందు, ఆ తర్వాత హైదరాబాదు నగరం నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వంటి వాటిని పరిశీలించడం, బస్టాండులు, రైల్వే స్టేషన్లోని సిసి కెమెరాలను పరిశీలించడం చేస్తున్నారు.
ఇండియన్ ముజాహిదీన్ సభ్యులు ఎలాంటి ఆధారాలు దొరకనీయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పేలుళ్లకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. దీంతో, ఏ అంశాన్ని వదిలి పెట్టకుండా దర్యాఫ్తు చేస్తున్నారు. పేలుడు కోసం వాడిన డిటోనేటర్ ఎక్కడిదో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. పేలుళ్లకు సైకిల్ వినియోగించినందున సైకిళ్లు అమ్మిన వారు లేదా పోగొట్టుకున్న వారు తమ సమాచారం అందించాలని పోలీసులు నగర వాసులను కోరారు.
ఆ రోజు ఉగ్రవాదాలు అరగంటలోపే పేలుళ్ల పని పూర్తి చేసినట్లుగా భావిస్తున్నారు. సమీపంలో బస చేసిన ఉగ్రవాదులు కోణార్క్, వెంకటాద్రి థియేటర్లలో రెండు నిమిషాల వ్యవధిలో పేలుళ్లు జరిపారు. సైకిళ్లు తీసుకు వచ్చి పేలుళ్లు జరపడం ఇదంతా కేవలం అరగంటలోనే పూర్తి చేసినట్లుగా భావిస్తున్నారు.