ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. అందరూ పాస్, శాటిస్పై కాకుంటే ఎగ్జామ్: సురేశ్
కరోనా వల్ల పరీక్షలు జరగడం లేదు. ఇంటర్ పరీక్షలను ఏపీ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలను వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలు జరగని నేపథ్యంలో కమిటీ సిఫారసుల మేరకు పదో తరగతి మార్కుల ఆధారంగా 30 శాతం వెయిటేజి, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజితో సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఇచ్చామని మంత్రి సురేశ్ తెలిపారు. దానికి అనుగుణంగా గ్రేడ్లు కేటాయించామని వివరించారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ లో 5,08,672 మంది విద్యార్థులు ఉండగా, అందరూ ఉత్తీర్ణులు అయ్యారని మంత్రి వెల్లడించారు. ఫలితాల పట్ల సంతృప్తి చెందకపోతే, వారికి తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఈ నెల 31 లోపు పరీక్ష ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. అందుకోసమే వారం రోజుల ముందే ఫలితాలు విడుదల చేశామని తెలిపారు.
కరోనా విజృంభించడంతో సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్ష ఫలితాలను ఎగ్జామ్స్ నిర్వహించకుండానే ప్రమోట్ చేసింది. 12వ తరగతి వారికి పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. కానీ కరోనా కేసులు తగ్గకపోవడంతో వెనక్కి తగ్గింది. వారిని కూడా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా వారి ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఇలా అన్నీ తరగతుల పరీక్ష ఫలితాలను ప్రకటించారు. ఒక ఎంసెట్ లాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాత్రమే నిర్వహిస్తున్నారు.