మరో ఛాన్స్.. జగనన్న చేదోడు పథకం కోసం ఆప్లై.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే
జగనన్న చేదోడు పథకం కింద నాయీబ్రాహ్మణులు, దర్జీలు, రజకులకు ఏపీ సర్కార్ సాయం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న లబ్దిదారుల ఖాతాల్లో రూ.10 వేలు జమ కూడా చేసింది. అర్హులుగా ఉండి ఈ పథకం డబ్బులు అందని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ తెలిపింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు పథకం లబ్ది మిస్ అయిన వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో మార్చి 11లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
జగన్ సర్కార్ వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు పథకం అమలు చేస్తోంది. లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదును జమ చేసింది. మొత్తం 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రెండో విడతలో రూ.285 కోట్లను విడుదల చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నగదుని సీఎం జగన్ బదిలీ చేశారు.
Recommended Video
షాపులు ఉన్న ప్రతి ఒక్కరికి జగనన్న చేదోడు కింద రూ.10వేల ఆర్ధిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ఈసారి షాపులు ఉన్న 1.46 లక్షల మంది టైలర్లకు రూ.146 కోట్లు, షాపులు ఉన్న 98 వేల మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులు ఉన్న 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. వరుసగా రెండేళ్లు కలిపి ఇప్పటివరకు జగనన్న చేదోడు కింద రూ.583 కోట్లు విడుదల చేశారు. 21 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పథకానికి అర్హులు. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు అవసరమైన చేతి పనిముట్లు, వారికి పెట్టుబడి కోసం ఈ సాయం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించారు.