ఏపీలో తేలికపాటి వాన.. ఆ జిల్లాల్లో పిడుగులు, జాగ్రత్తగా ఉండాలంటోన్న వాతావరణ శాఖ
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎండ ప్రభావం/ ఉక్కపోత ఉంటుంది. విజయవాడలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లిలో అత్యల్పంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ ప్రజలకు కాస్త తీపి కబురు అందజేసింది.
పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. ఏపీలో ప్రధానంగా తూర్పు గోదావరి, కాకినాడ, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి, వై. రామవరం, అడ్డతీగల, దేవీపట్నం రంపచోడవరం, గంగవరం ప్రాంతాల్లో పిడుగుల పడతాయని హెచ్చరించింది.
తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం, కోరుకొండ, కాకినాడ జిల్లాలో జగ్గంపేట, ఏలేశ్వరంలో పిడుగులు పడొచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి, రామాపురం, రాయచోటి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె మండలాలు పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
ఆయా జిల్లాలోని పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు ఎత్తైనా చెట్ల కింద ఉండొద్దని సజెస్ట్ చేసింది. బహిరంగ ప్రదేశాల్లోనూ బయట ఉండరాదని జిల్లా ప్రాంత వాసులకు వాతావరణ శాఖ సూచన చేసింది. పిడుగులు పడే సమయంలో జిల్లాల వాసులు సురక్షిత భవనాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.