కేంద్రం కన్నెర్ర-హైకోర్టు పిల్ ఎఫెక్ట్-కేంద్ర పథకాల పేర్ల మార్పుపై జగన్ సర్కార్ వెనక్కి
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకాలకు తమ పేర్లు పెట్టుకోవడం మొదలైంది. అప్పట్లో టీడీపీతో కలిసున్నంత సేపు దీనిపై నోరు మెదపని బీజేపీ ఆ తర్వాత విడిపోయాక మాత్రం అభ్యంతరాలు చెప్పడం మొదలుపెట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ కేంద్ర పథకాలకు రాష్ట్రం తమ పేర్లు పెట్టుకోవడం కొనసాగుతోంది. దీనిపై కేంద్ర మంత్రులు గర్జించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు.
కేంద్ర పథకాలకు జగన్ పేర్లు
ఏపీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు సీఎం జగన్ పేర్లు పెట్టడం కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి జగనన్న పాలు, జగనన్న గోరు ముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ వంటి పేర్లు పెట్టారు. కేంద్రం అమలు చేస్తున్న ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాల ద్వారా డబ్బులు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా వీటి నుంచి మైలేజ్ పొందుతోంది. దీనిపై కేంద్రానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. అలాగే రాష్ట్ర హైకోర్టులోనూ పిల్ దాఖలైంది.
కేంద్రం అభ్యంతరాలు
కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇస్తున్న డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వాధినేత పేరుకు మార్చి అమలు చేయడంపై స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్రమంత్రులు ఇప్పటికే తప్పుబట్టారు. ఇదే పరిస్ధితి కొనసాగితే భవిష్యత్తులో కేంద్ర పథకాల కింద ఇచ్చే నిధుల్లో కోత పెడతామంటూ హెచ్చరికలు కూడా అందాయి. అలాగే కేంద్ర పథకాల నిధుల మళ్లింపుకు కూడా వీల్లేకుండా గట్టి ఆంక్షలు కూడా విధించారు. దీంతో కేంద్ర పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా పోయింది.
హైకోర్టులోనూ పిల్
కేంద్ర ప్రాయోజిత పథకాల పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయడంపై ఏపీ హైకోర్టులోనూ పిల్ దాఖలైంది. మద్దిపాటి శైలజ దాఖలు చేసిన ఈ పిల్ పై హైకోర్టు విచారణ జరుగుతోంది. కేంద్ర పథకాల పేర్లను మార్చి అమలు చేయడం ద్వారా వాటి అసలు ఉద్దేశం నెరవేరడం లేదని, రాష్ట్రప్రభుత్వం రాజకీయ ప్రయోనాలు మాత్రమే నెరవేరుతున్నట్లు పిటిషనర్ ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం కూడా వైసీపీ సర్కార్ కు ఇబ్బందికరంగా మారుతోంది.
పేర్ల మార్పుపై జగన్ యూటర్న్
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పథకాల పేర్ల మార్పుపై అభ్యంతరాల నేపథ్యంలో వాటిని మార్చకుండాతగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ అన్ని శాఖలకూ అత్యవసర నోట్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం నిధులందిస్తున్న సాంఘిక సంక్షేమశాఖకు సంబంధించిన పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చి అమలు చేస్తోందని గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో పిల్ వేయడంతో ఆర్థికశాఖ అధికారులు ఆ మేరకు నోట్ పంపారు.
కేంద్ర ప్రభుత్వ నిధులిస్తున్న పథకాలకు సంబంధించి బడ్జెట్ లో ఆయా పేర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తాజా నోట్లో పేర్కొన్నారు.