ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం .. రేపు విజయవాడకు జనసేనాని పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్రంలో మొత్తం 12 నగరపాలక, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీ లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ లో ఎన్నికలకు హైకోర్టు స్టే ఇవ్వడంతో పోలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ఈ రోజు హైకోర్టులో లంచ్ కోషన్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ కొనసాగుతోంది.
ఏపీలో ఎన్నికల ప్రలోభాలు .. విజయవాడలో భారీగా నగదు పట్టుకున్న అధికారులు
రేపు విజయవాడకు పవన్ కళ్యాణ్ .. ఓటు హక్కు వినియోగించుకోనున్న జనసేనాని
ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు విజయవాడ రానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం విజయవాడకు రానున్నారు. గత ఎన్నికల్లో ఆయన విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు . రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. విజయవాడలోని పడమటి లంక జిల్లా పరిషత్ స్కూల్ లో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎవరి ధీమాలో వారు .. అన్ని పార్టీల్లో టెన్షన్ టెన్షన్
ఈ దఫా మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలన్నీ హోరెత్తించాయి. ఓటర్లు తమ తుది తీర్పును ఇవ్వబోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను మున్సిపల్ ఎన్నికల్లో కూడా సాధిస్తామని అధికార వైసిపి ధీమా వ్యక్తం చేస్తుంటే, ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని టిడిపి నాయకులు ఆశాభావంతో ఉన్నారు. ఇదే సమయంలో బిజెపి జనసేన లు ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని భావిస్తున్నారు.
రేపు పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు .. భద్రత కట్టుదిట్టం
రాష్ట్రంలో 75 పురపాలక నగర పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మునిసిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్లో మొత్తం 78,71,272 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పార్టీ గుర్తులతో నిర్వహించే మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి చేసింది.
ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమీషనర్ సూచన
మొత్తం 7915 పోలింగ్ కేంద్రాలలో సగానికి పైగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నకారణంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం మొత్తం 48, 723 మంది ప్రభుత్వ ఉద్యోగులు సేవలను వినియోగించుకోనున్నారు. ఇక ఓటర్లు అందరూ సామాజిక స్పృహతో పోలింగ్ లో పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు.
ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు.