జగన్ సర్కార్ స్ట్రాంగ్ డెసిషన్: డిగ్రీలో విద్యాబోధన ఆ లాంగ్వేజ్లోనే: టీడీపీకి మరో ఛాన్స్
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్లోనే విద్యాబోధన సాగించాలనే విషయంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, తెలుగు భాషాభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటూ వస్తోన్న జగన్ సర్కార్.. ఈ విషయంలో తన రూటు మార్చినట్టు కనిపిస్తోంది. ప్రాథమిక, మాధ్యమిక విద్యలో సాధించలేని ఈ మార్పును ఉన్నత విద్య విభాగంలో తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇది కాస్తా మరోసారి విమర్శలకు దారి తీసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి తెలుగుదేశం పార్టీకి మరో అవకాశం లభించినట్టయిందని చెబుతున్నారు.
Galwan valley clash: కల్నల్ సంతోష్బాబును స్మరిస్తోన్న దేశం: సూర్యపేట్లో విగ్రహం
ఈ విద్యాసంవత్సరం నుంచే..
రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లీష్లో మాత్రమే విద్యాబోధన కొనసాగించాలంటూ ఉన్నత విద్యామండలి కార్యదర్శి బీ సుధీర్ ప్రేమ్కుమార్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే.. 2021-2022 నుంచే ఇది అమల్లోకి వస్తుందని స్ఫష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు-అన్ ఎయిడెడ్, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాల్లో డిగ్రీ విద్యాబోధన ఇంగ్లీష్లోనే కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలుగు మీడియంలో పాఠ్యాంశాలను బోధించే అన్ని కళాశాలు కూడా ఇంగ్లీష్లోకి మార్పు చెందాలని సూచించారు.
ఇంగ్లీష్లో బోధనకు అంగీకరిస్తేనే..
ఈ నెల 12వ తేదీన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాగిన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్కుమార్ తెలిపారు. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ అన్-ఎయిడెడ్ హానర్స్ ప్రోగ్రామ్ను అందించడానికి కొత్తగా ఏర్పాటు చేయనున్న అన్ ఎయిడెడ్ కళాశాలలకు ఇంగ్లీష్లో మాత్రమే పాఠ్యాంశాలను బోధించడానికి అంగీకరిస్తేనే- అనుమతి ఇస్తామని సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉన్నడిగ్రీ కళాశాలలు, విద్యాసంస్థలు కూడా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చుకోవడానికి అవసరమైన ప్రతిపాదనలను ఉన్నత విద్యామండలికి అందజేయాలని సూచించారు.
ప్రతిపాదనలు పంపించడానికి డెడ్లైన్
దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపించడానికి ఉన్నత విద్యామండలి 10 రోజుల గడువు ఇచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ నాటికి వాటిని పంపించాల్సి ఉంటుంది. గడువు దాటిన ప్రతిపాదనలను అంగీకరించబోమని సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు. తమ తమ ప్రతిపాదనలను పంపించని కళాశాలలు ఈ విద్యాసంవత్సం నుంచి తమ ప్రోగ్రామ్లను ఆఫర్ చేయలేవని చెప్పారు. అండర్ గ్రాడ్యుయుషన్ ప్రోగ్రామ్స్ను ఆఫర్ చేయలేని ప్రైవేటు అన్ ఎయిడెడ్, ప్రైవేటు ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు తమ ప్రతిపాదనలను ఈ 1010 రోజుల వ్యవధిలోనే ఉపసంహరించుకోవచ్చని తెలిపారు.
స్వాగతించిన టీచర్స్ అసోసియేషన్
ఉన్నత విద్యామండలి జారీ చేసిన ఈ ఆదేశాలను ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏఆర్ చంద్రశేఖర్ స్వాగతించారు. ఈ దిశగా ఫ్యాకల్టీలకు శిక్షణ ఇప్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. 2005 నుంచి 2010 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫెలో ట్రైనింగ్లను ఇప్పించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తోన్న స్థాయి ఫ్యాకల్టీలకు ఇంగ్లీష్పై మంచి పట్టు ఉందని ఆయన పేర్కొన్నారు. మాతృభాష తెలుగుకు సంబంధించిన కొన్ని పాఠ్యాంశాలను కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.