17నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: శతాబ్ది ఉత్సవాలకు గవర్నర్కు కోడెల ఆహ్వానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు 6రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఈ సారి కూడా హైదరాబాద్లోనే జరగనున్నాయి.
శతాబ్ది ఉత్సవాలు: గవర్నర్కు ఆహ్వానించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సోమవారం రాజ్ భవన్లో కలిశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాలకు గవర్నర్ను ఈ సందర్భంగా కోడెల ఆహ్వనించారు.
అనంతరం కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. డిసెంబర్ 11వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు నరసరావుపేట మున్సిపాలిటీ శతాబ్ధి ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, గవర్నర్ నరసింహన్ హాజరవుతారన్నారు.
స్పీకర్గా ఉన్న అన్ని అవకాశాలు వినియోగిస్తున్నామని, ఓట్ల కోసం, రాజకీయాల కోసం చేయటం లేదని కోడెల శివప్రసాదరావు తెలిపారు. రూ.200 కోట్లతో నరసరావుపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మాణంతో పాటు, 5శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.