కాంగ్రెస్ టార్గెట్ జగన్, సోనియా-రాహుల్లతో క్షమాపణ చెప్పించాలని..
విభజన నేపథ్యంలో ఏపీలో దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. మళ్లీ జవసత్వాలను కూడగట్టుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది.
అమరావతి: విభజన నేపథ్యంలో ఏపీలో దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. మళ్లీ పట్టు సాధించేందుకు వ్యూహాలను రచిస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్తో నేతలు చర్చించిన విషయం తెలిసిందే.
అంతా లగడపాటి వల్లే, నేనూ విన్నా.. కిరణ్ రెడ్డి చెప్పాల్సిందే: జెడి శీలం
ఈ సందర్భంగా వారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాల పేరిట అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తిరిగి పేదలకు కాంగ్రెస్ హయాంలో అందిన ఫలాలను వివరించాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ నిర్ణయాలు
ఇప్పటికే పార్టీ డిసిసి, అనుబంధ సంఘాల ఎన్నికల ప్రక్రియ 80 శాతం మేర పూర్తయిందని, మిగిలిని ప్రక్రియను కూడా నెలాఖరులోగా పూర్తి చేయాలని తీర్మానించారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్తో పాటు మిగిలిన పదవులను కూడా ఎంపిక చేయాలని నిర్ణయించారు. రానున్న రోజుల్లో ప్రజలతో పూర్తిగా మమేకం కావాలని నిర్ణయం తీసుకున్నారు.
నంద్యాలపై అంతర్మథనం
నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసి తప్పు చేశామని ఏపీ కాంగ్రెస్ నేతలు అంతర్మథనం చెందుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ఓటమితో మరింత పరువు పోయిందని భావిస్తున్నారు. దీంతో విభజన బాధను ప్రజలు ఇంకా మరిచిపోలేదని అర్థమవుతోందని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
సోనియా లేదా రాహుల్తో క్షమాపణ
విభజన అంశాన్ని ప్రజలు ఇంకా మరిచిపోనందున, ప్రజల్లో ఆ కోపం ఇంకా ఉందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారని తెలుస్తోంది. నంద్యాల ఓటమి నేపథ్యంలో 2019 వరకైనా పార్టీ టిడిపి వైసిపిలకు పోటీ ఇవ్వాలంటే సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీలతో రాష్ట్రంలో ఓ సభ ఏర్పాటు చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది.
వైసిపియే తమ శత్రువు
రాష్ట్రంలో జగన్ స్థాపించిన వైసిపియే తమ ప్రధాన శత్రువు అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తే వైసిపి ఓట్లు అన్నీ తమవేనని, ఆ పార్టీ బలహీనపడితే కాంగ్రెస్ బలపడుతుందని భావిస్తున్నారు. వైసిపిని బలపహీనపరిస్తేనే బలం పుంజుకుంటుందని భావిస్తున్నారు.