ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు వాయిదా-జేఈఈ మెయిన్స్ తో క్లాష్-కొత్త తేదీలివే
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలతో ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ఇంటర్ పరీక్షల తేదీలు క్లాష్ కావడంతో ఈ మేరకు విద్యార్ధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ మేరకు జరగాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ ప్రకటించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ పరీక్షల షెడ్యూలు ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఐఐటీ లకు 16 ఏప్రిల్ నుంచి 21 ఏప్రిల్ వరకు పరీక్షలు జరగబోతున్నాయి. అందుకే ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్లు విద్యామంత్రి తెలిపారు.
ఏప్రిల్ 8 నుంచి 22 వరకు చేపట్టాల్సిన పరీక్షలు నిర్వహించాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు వాటిని ఏప్రిల్ 22 నుంచి నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేశారు. ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మొదలై మే 12 తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం గతంలో ప్రకటించినట్టుగానే మార్చి 11 తేదీ నుంచి మార్చి 31 వరకు జరుగుతాయని విద్యామంత్రి తెలిపారు.కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరిక్షల నిర్వహణ ఉంటుందన్నారు.
Recommended Video
తాజా షెడ్యూల్ మేరకు బోర్డు తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల కోసం 1400 కేంద్రాలు పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉంచనున్నారు. 900 ల్యాబ్ పరీక్షా కేంద్రాలు ఉంటాయన్నారు. ఇన్విజిలేషన్ సిబ్బంది సమస్య లేదని విద్యామంత్రి తెలిపారు. 10 తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన పరీక్షా కేంద్రాలకు ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.