అదే అంబులెన్స్లో వైఎస్ జగన్, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉంటే: బీజేపీ నేత విష్ణు కౌంటర్
కర్నూలు: ఏపీ-తెలంగాణ మధ్య సరిహద్దు సమస్యలు మళ్లీ తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ పోలీసులు ఏపీ నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించట్లేదు. అంబులెన్స్లు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తరలి వెళ్తోన్న పేషెంట్లతో కూడిన అంబులెన్స్లను కూడా తెలంగాణ పోలీసులు నిలిపివేస్తోన్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్కు తరలి వెళ్తోన్న అంబులెన్స్లను నిలిపివేయడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
అదే అంబులెన్స్లో వైఎస్ జగన్, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉంటే: బీజేపీ నేత విష్ణు కౌంటర్#ysjagan #KCR #BJP pic.twitter.com/b6dR5bVtDv
— oneindiatelugu (@oneindiatelugu) May 14, 2021
దీనిపై రాజకీయ విమర్శలు చెలరేగుతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ దుస్థితి తలెత్తిందంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలను సంధిస్తోన్నారు. సోదరభావంతో మెలగాల్సిన ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వైరుధ్యాలకు ఇది నిదర్శనంగా చెబుతున్నారు. ఇదివరకు తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకున్న తరువాత సమసిపోయిందనుకున్న ఈ వివాదం మళ్లీ చెలరేగడం.. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని మండిపడుతోన్నారు. తక్షణ జోక్యం అవసరమని డిమాండ్ చేస్తోన్నారు.
రెండురోజులుగా ఏపీ, తెలంగాణ మధ్య ఈ సమస్య నెలకొని ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోకపోవడం దురదృష్టకరమని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. అదే అంబులెన్సుల్లో ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ లేదా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేదా? అని ప్రశ్నించారు. తమ ఆప్తులు అంబులెన్స్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద గంటల కొద్దీ అంబులెన్స్లను నిలిపివేసినప్పటికీ.. అధికారులు కనీసం జోక్యం చేసుకోవట్లేదని విమర్శించారు.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు న్యాయస్థానాల ఆదేశాలను పట్టించుకోవట్లేదని, ప్రతిపక్షాల చెప్పే సూచనలను లెక్క చేయట్లేదని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రజల ప్రాణాలంటే చులకన భావన నెలకొని ఉందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఇదివరకే ఓ సారి కరోనా వైరస్ బారిన పడ్డారని, ఆ పేషెంట్ల బాధలు ఆయనకు తెలియనివా? అని ప్రశ్నించారు. కరోనా పేషెంట్లందరూ కేసీఆర్ లాగా వందల ఎకరాల ఫామ్హౌస్లో ట్రీట్మెంట్ తీసుకోలేరని ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Recommended Video