విడిపోయినా కలిసే: బాలుకు జస్రాజ్ ఆశీస్సులు
విశాఖపట్నం: తెలుగు హమారీ మాతృభాష అని ప్రముఖ హిందుస్థానీ విద్వాంసుడు పద్మవిభూషణ్ పండిట్ జస్రాజ్ అన్నారు. శ్రీకొప్పరపు కళాపీఠం ఆధ్వర్యంలో మంగళవారం కళాభారతి ఆడిటోరియంలో పండిట్ జస్రాజ్కు కొప్పరపు కవుల కళాపీఠంజాతీయ ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం జస్రాజ్ ఆశీస్సులు తీసుకున్నారు.
తన చిన్నతనంలో హైదరాబాదులోనే సాగిందని జస్రాజ్ చెప్పారు. తాను విన్న తెలుగు భాషకు, సభలో మాట్లాడిన భాషకు మధ్య ఎంతో తేడా ఉందని ఆయన అన్నారు. ఈ భాష ఎంతో పాండిత్యంతో కూడుకుని ఉన్నదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్కు వస్తే ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని, తనని ఎప్పుడు పిలిచినా ఇక్కడకు వచ్చి తన గాత్రాన్ని వినిపిస్తానని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినా ఇక్కడి ప్రజలు ఎప్పటికీ కలిసే ఉంటారని ఆయన అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడని, 30 ఏళ్లుగా బాలు గానం వింటున్నానని ఆయన చెప్పారు. భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహా సంగీత విద్వాంసుడు జస్రాజ్ అని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కొప్పరపు కవులు గొప్ప సరస్వతీ ఉపాసకులని, వారి పద్యాలు పాఠ్యాంశాలు కావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, మంత్రి గంటా శ్రీనివాసరావు, తిదతరులు పాల్గొన్నారు. కొప్పరవు వెంకట సుబ్బరాయ, కొప్పరపు వెంకటరమణ కవుల జీవిత సారాంశాన్ని పాఠ్యాంశంగా పెడుతామని గంటా శ్రీనివాస రావు హామీ ఇచ్చారు.