చంద్రబాబువల్ల వార్ తప్పింది: విభజనపై అశోక్ వ్యాఖ్య
విజయనగరం: విభజన అనంతరం ఏర్పడిన కొన్ని సమస్యల సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమయస్ఫూర్తితో వ్యవహరించారని, లేకుంటే సివిల్ వార్ ఏర్పడేదని కేంద్రమంత్రి అశోక గజపతిరాజు ఆదివారం అన్నారు.
విజయనగరంలో జరిగిన టీడీపీ జిల్లా కమిటీ ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు చొక్కాలు చింపుకునే సంఘటనను చూడవలసిన దౌర్భాగ్యం మనకు పట్టిందన్నారు. వీటన్నింటికి కాంగ్రెస్ ప్రధాన కారణమన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిపిన నాటి కాంగ్రెస్ పాలకులు, నేడు విమర్శలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులది భావ దారిద్య్రమో లేక భాష దారిద్య్రమో అర్థం కావట్లేదన్నారు.
అడ్డగోలుగా విభజించినందుకు రాష్ట్ర ప్రజలు నేడు అనేక బాధలు పడాల్సి వస్తోందన్నారు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ పెద్దలు రాష్ట్రాభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు.
కాగా, టీడీపీ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో ఆదివారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో అశోక గజపతి రాజు వ్యవహార శైలి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చనీయాంశమైంది. పార్టీ సూచించిన విధానాన్ని కాదని, ఆయన ఏకపక్షంగా వ్యవహరించారన్న అసంతృప్తి రాష్ట్ర కార్యాలయ వర్గాల్లో వ్యక్తమైందంటున్నారు.

ఎన్నికల నిర్వహణకు పార్టీ పరిశీలకులుగా విజయనగరం వెళ్లిన మంత్రులు రావెల కిశోర్ బాబు, పల్లె రఘునాథ రెడ్డి, ఆ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలు, ఇతర ముఖ్య నాయకుల అభిప్రాయాలను తీసుకొని తుది నిర్ణయం వెల్లడించాలన్నది పార్టీ విధానం.
కానీ అశోక్ గజపతి రాజు దీనితో సంబంధం లేకుండా తనకు తానే ప్రస్తుత అధ్యక్షుడు ద్వారంపూడి జగదీశ్ ఈసారి కూడా కొనసాగుతారని ప్రకటించారని అంటున్నారు. కేంద్ర మంత్రి హోదాలోని నేత ఆ మాట చెప్పటంతో మిగిలిన నాయకులంతా కిమ్మనకుండా చప్పట్లు కొట్టారంటున్నారు. పరిశీలకులుగా వెళ్లిన రాష్ట్ర మంత్రులు కూడా అశోక్ సీనియారిటీ దృష్ట్యా, మౌనం వహించారట.












Click it and Unblock the Notifications