ఎస్వీయూ విద్యార్థిగా: జ్ఞాపకాలను నెమరేసుకున్న చంద్రబాబు
తిరుపతి: నేను ఎక్కడికెళ్లినా శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థిగానే గుర్తింపు తెచ్చుకున్నానని, అలాంటి ఈ ప్రాంతాన్ని మరువలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఏపీ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభించేందుకు ఎస్వీయూకు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు అన్న మాటలివి.
ఈ సందర్భంగా ఎస్వీయూ పూర్వ విద్యార్ధిగా తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నా మూలాలు ఇక్కడే. నాడు ఎస్వీయూ విద్యార్థిగా ఉంటూ రాజకీయల్లోకి వచ్చాను. ఎమ్మెల్యేగా గెలిచాను. ఆ రోజు నా బలం మీ విద్యార్థులే. శ్రీవారి ఆశీస్సులతో 2003లో జరిగిన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. తిరిగి ప్రజలకు సేవ చేసేందుకే ఆ భగవంతుడు నన్ను రక్షించాడు' అని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ నాయకుడిగా కన్నా, ఎస్వీయూ పూర్వవిద్యార్థిగా గుర్తింపు పొందటం ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. సామాజిక, కార్పొరేట్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో లీడర్లు యూనివర్సిటీల్లోనే తయారవుతారన్నారు. ‘మీరు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడండి. మీలోని శక్తిని వెలుగులోకి తెండి. భిన్నంగా ఆలోచించండి. కొత్త ఆవిష్కరణలకు నాంది పలకండి' అని యువ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు.
తిరుపతి కేంద్రంగా ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ఎస్వీయూలోనూ ఇంక్యూబేషన్ సెంటర్, స్టార్ట్ప్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. సైన్స్ కాంగ్రెస్ వేదికపై ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ దామోదరంతో సుదీర్ఘంగా చర్చించారు. వర్సిటీ అభివృద్ధికి పలు సూచనలు చేశారు.
నెలరోజుల్లో యూనివర్సిటీ క్యాంపస్ రూపురేఖలు మారాలని వీసీకి ఆయన సూచించారు. యంగ్ అండ్ ఎనర్జటిక్, డైనమిక్ వీసీ అని దామోదరాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. సిఫార్సుపై కాకుండా, ప్రతిభపైనే ఆయన ఎంపికయ్యారన్నారు. దేశంలోని తొలి పది వర్సిటీల్లో ఒకటిగా ఎస్వీయూను అభివృద్ధిచేసేందుకు చర్యలు చేపడతామన్నారు.