సీఎం జగన్ తో చిరంజీవి టీం భేటీ : ముహూర్తం ఖరారు : అదే-ప్రధాన అజెండా..!!
టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత చిరంజీవి రెండు సార్లు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. ఒక సారి సైరా సినిమా చూడాలంటూ సీఎం జగన్ ను చిరంజీవి కోరారు. ఆ సమయంలో చిరంజీవి దంపతులను విందుకు ఆహ్వానించిన సీఎం జగన్ తన నివాసంలో చిరంజీవిని సత్కరించారు.
చిరంజీవికి సీఎం జగన్ ఆత్మీయ స్వాగతం..
ఆ తరువాత సినిమా పరిశ్రమ సమస్యల మీద ఇతర ప్రముఖులతో కలిసి సీఎంను కలిసారు. ధియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వాటికి ప్రభుత్వం నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన సీఎం జగన్.. కొద్ది నెలల క్రితం అదే విధంగా ఉత్తర్వులు జారీ చేసారు. దీనికి చిరంజీవి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఇక, కర్నూలు ఏయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు సీఎం జగన్ ఖరారు చేసారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన చిరంజీవి సీఎంను అభినందించారు.
వకీల్ సాబ్ నుంచి టిక్కెట్ల రగడ..
ఇక, వకీల్ సాబ్ సినిమా నుండి ఏపీలో టిక్కెట్ల వ్యవహారం వివాదంగా మారింది. దీని పైన ఎగ్జిబిటర్లు కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రముఖ నటుల సినిమాలు విడుదల సమయంలో టిక్కెట్ల ధరలు పెంచుకొనే అవకాశం సాధారణంగా ఇచ్చేవారు. కానీ, వకీల్ సాబ్ కు ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ తరువాత ఆ రకంగా పెంచుకొనే నిర్ణయం జేసీల నుంచి తప్పించి..ప్రభుత్వ నిర్ణయం మేరకే అనుమతులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పాటుగా వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తోంది.
నంది అవార్డుల వ్యవహారం పైనా చర్చ..
అదే విధంగా టీడీపీ ప్రభుత్వంలోనూ నంది అవార్డుల ప్రధానం జరగలేదు. ఏ సినిమాకు అవార్డు ఇవ్వాలో ప్రకటించాక..అందచేయలేదు. అయితే, జగన్ ప్రభుత్వం తాము వచ్చిన తరువాత 2019 నుంచి ఇవ్వాల్సి ఉందని..ఇస్తామని హామీ ఇచ్చింది. దీని పైన ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు కాలేదు. ఈ విషయాల పైన మరోసారి ముఖ్యమంత్రి జగన్ తో చర్చించటానికి చిరంజీవి నాయకత్వంలో టాలీవుడ్ టీం సిద్దమైంది. సీఎం అప్పాయింట్ మెంట్ కోరింది. అయితే, కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ అప్పాయింట్ మెంట్ ఖరారు కాలేదు.
ఈ వారంలోనే సీఎం-చిరంజీవి టీం భేటీ..
ఇక, ఈ వారంలో 18 లేదా 19వ తేదీల్లో సీఎం తో కలిసేందుకు అవకాశం..ఇందుకు సిద్దమవ్వాలంటూ చిరంజీవి టీంకు ప్రభుత్వం నుంచి సమాచారం పంపినట్లు విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్ నుంచి చిరంజీవితో పాటుగా మిగిలిన కేటగిరీలకు చెందిన వారు..సాధ్యమైనంత తక్కువ మంది వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని అందులో సూచించినట్లుగా తెలుస్తోంది. గతంలో సీఎంను కలిసిన సమయంలో చిరంజీవితో పాటుగా..నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు, దిల్ రాజు వంటి వారు హాజరయ్యారు.
చిరంజీవికి సీఎం జగన్ హామీ..
అయితే, ఇప్పుడు రాజమౌళి ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన వచ్చే అవకాశం లేదు. చిరంజీవి తో పాటుగా ఎవరు వెళ్తారనేది ఆ రోజుకు సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇక, విశాఖలో సినీ పరిశ్రమ విస్తరించటానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని గతంలోనే సీఎం జగన్ హామీ ఇచ్చారు. అదే విధంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఏ సమస్య ఉన్న తన వద్దకు రావచ్చని చిరంజీవికి అప్పట్లోనే సూచించారు.
విశాఖలో సినీ పరిశ్రమ విస్తరణ..
ఆ తరువాత విశాఖలోని రామానాయుడు స్టూడియో స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వార్తలు వచ్చాయి. దీనిని కొద్ది రోజుల క్రితం స్టూడియో అధినేత సురేష్ బాబు ఖండించారు. ఇక, ఇప్పుడు సీఎంతో ఈ సారి జరిగే భేటీలో టిక్కెట్ల ధరల విషయమే ప్రధాన అజెండాగా ఉండనుంది. మారుతోంది. దీంతో పాటుగా గతంలో ముఖ్యమంత్రుల వద్దకు బాలయ్య...మోహన్ బాబు వంటి వారిని తీసుకెళ్లకపోవటం కూడా వివాదం గా మారింది. అయితే, ఇప్పుడు మా ఎన్నికల వివాదం నేపథ్యంలో ఎవరెవరు సీఎం వద్దకు వెళ్లే టీంలో ఉంటారనేది వేచి చూడాలి. ఇక, టిక్కెట్ల ధరల పెంపు పైన గతంలో ససేమిరా అని చెప్పిన జగన్..ఇప్పుడు ఏ రకంగా స్పందిస్తారు..చిరంజీవి ఎలా ఒప్పిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.