సామాన్యుడికి సంకటం: ఎటీఎంల్లో నో క్యాష్.. బ్యాంకుల్లో తగ్గిన నిల్వలు
తిరుపతి: చిత్తూరు జిల్లా వాసులకు మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. ఏటీఎంల వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. నెల రోజులుగా ఆర్బీఐ చిల్లిగవ్వ కూడా విదల్చకపోవడంతో బ్యాంకుల్లో నగదు కొరత నెలకొన్నది. జిల్లా వ్యాప్తంగా 596 బ్యాంకు శాఖల్లో రూ.488.99 కోట్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆర్బీఐ నుంచి నగదు రాకుంటే నగదు కష్టాలు పెరిగే ప్రమాదం ఉన్నదని అభిప్రాయ పడుతున్నారు. 712 ఏటీఎంలలో 150 ఏటీఎంలకు మించి పనిచేయడం లేదు. పని చేస్తున్న ఏటీఎంలు కూడా అరకొరగా సేవలందిస్తున్నాయి. చిన్న బ్యాంకుల్లో నగదు నిల్వలు లేక ఏటీఎంలను తాత్కాలికంగా మూసివేశారు. ఖాతాదారులు నగదు డిపాజిట్ చేసేందుకు అనాసక్తి చూపుతున్నారు. దీంతో నగదు కొరత ఏర్పడుతోంది.
నగదు రహిత లావాదేవీలు నామమాత్రంగా కొనసాగుతుండడంతో నగదు కష్టాలు మొదటికొచ్చాయి. గతేడాది నవంబర్లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత రెండు నెలల పాటు జిల్లాలో నగదు కష్టాలతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ ఏడాది ప్రారంభం తర్వాత ఒకింత నగదు కష్టాలు తొలగిపోయాయి. ఆర్బీఐ బ్యాంకులకు దశలవారీగా నగదు పంపిణీ చేస్తూ వచ్చింది.

నగదు రహితం పేరిట పైసా విదల్చని ఆర్బీఐ
నగదు రహితం పేరుతో గతనెలలో ఆర్బీఐ పైసా కూడా విదల్చ లేదు. ఫలితంగా బ్యాంకులో నగదు నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం 40 జాతీయ బ్యాంకుల పరిధిలో 596 బ్యాంకు శాఖలు ఉన్నాయి. వీటిలో రూ.488.99 కోట్లు మాత్రమే నిల్వ ఉంది. ఈ నెల మొదటి వారంలో బ్యాంకుల్లో నగదు విత్డ్రా చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇలానే కొనసాగితే రెండు వారాల్లో నగదు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదముందని తెలుస్తోంది.
Recommended Video


ఏటీఎంలలో నో క్యాష్
జిల్లాలో 712 ఏటీఎం కేంద్రాలు ఉంటే 150కు మించి పనిచేయడం లేదు. వాటిలో కూడా గంటల వ్యవధిలో నగదు ఖాళీ అవుతోంది. దీంతో ఏటీఎం కేంద్రాలకు వెళ్లే ఖాతాదారులకు అవస్థలు తప్పడం లేదు. చిన్న బ్యాంకు శాఖలు ఏటీఎం కేంద్రాలను నిర్వహించలేక తాత్కాలికంగా మూసివేశాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పుత్తూరు, పుంగనూరు వంటి ప్రాంతాల్లో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్, యూనియన్ బ్యాంక్ శాఖలకు చెందిన ఏటీఎంలలో నగదు లేక బోసిపోయాయి. ఎస్బీఐ శాఖలకు చెందిన ఏటీఎంలో నగదు అందుబాటులోకి తీసుకొచ్చినా కొద్దిసేపట్లోనే నగదు ఖాళీ అయిపోయింది.

డిపాజిట్లకు ఖాతాదారుల్లో అనాసక్తి
ఖాతాదారులు బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేసుకుంటున్నారే గాని డిపాజిట్ చేయడం లేదు. దీంతో బ్యాంకులో డబ్బుల రొటేషన్ ఆగిపోయింది. మూడుసార్లకు మించి నగదును డిపాజిట్, విత్డ్రాలు చేస్తే సేవా పన్ను విధిస్తామని బ్యాంకులు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు.

నగదు రహితం నామమాత్రం
నగదు కష్టాల నుంచి గట్టేక్కడానికి నగదు రహితం ఒక్కటే శరణ్యమని అధికారులు చెప్పుకొచ్చారు. బ్యాంకర్లు కూడా దీనినే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీల్లో ఖాతాదారులు దారుణంగా మోసపోతున్నాడు. స్వైపింగ్ ద్వారా కొనుగొలు చేసే ఖాతాదారులకు రూ.100కి రూ.1.20 సర్వీసు ట్యాక్స్ పడుతోంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తే కంటికి కనిపించకుండా సర్వీసు చార్జీల పేరుతో నగదు ఖాతాల్లోనుంచి మాయమవుతుండడంతో ప్రజలు నగదు రహితం జోలికి వెళ్లడానికి భయపడుతున్నారు.

బ్యాంకుల్లో నగదు కొరత నిజమే
జిల్లా బ్యాంకుల్లో నగదు కొరత వాస్తవమే తిరుపతి లీడ్ బ్యాంక్ డీజీఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఏటీఎంలు పరిమితంగా పనిచేస్తున్నాయన్నారు. ఆర్బీఐ నుంచి నగదు రావాల్సి ఉన్నదని, నెల రోజులుగా జిల్లాకు ఆర్బీఐ నగదును పంపిణీ చేయలేదని తెలిపారు. దీంతో బ్యాంకుల్లో తాత్కాలిక నగదు కొరత ఏర్పడిందన్నారు.












Click it and Unblock the Notifications