అంగీకరించదు: కెసిఆర్ను ఏకేసిన దేవినేని ఉమ
విజయవాడ: శ్రీశైలంలో జల విద్యుత్తు ఉత్పత్తి వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవేనేని ఉమామహేశ్వర రావు విరుచుకుపడ్డారు. కృష్ణా రివర్ బోర్డు చైర్మన్పై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను సభ్య సమాజం అంగీకరించదని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.
విభజన బిల్లు ద్వారా ఏర్పడిన కృష్ణా రివర్ బోర్డు నిర్ణయాలను గౌరవించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. పంతాలకు పోయి శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం కరెంట్ ఉత్పత్తి చేస్తోందని ఆయన మండిపడ్డారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగువారంతా ఒకే తల్లి బిడ్డలను ఆయన వ్యాఖ్యానించారు. కరువు పీడిత ప్రాంతాలకు మంచినీళ్లు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.
కేంద్రం గడ్డి పీకుతోందా...
రైతుల ఆత్మహత్యలు నివారించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. అన్నదాతల ఆత్మహత్యల అంశంపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
భూసమస్య కార్యాచరణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆయన అన్నారు. గిరిజన, దళితుల సంక్షేమంపై కెసిఆర్కు చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. నిధులు, నీళ్లు, కొలువులు దిశగా ప్రభుత్వం ఏ ప్రయత్నాలు చేసిందని ఆయన అడిగారు. హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
తెలుగు రాష్ట్రాలు తన్నుకుంటుంటే కేంద్రం గడ్డి పీకుతోందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం రాజకీయ క్రీడ ఆడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో సమస్యలకు కారణమైన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ధర్నాలు చేయడం సిగ్గు చేటు అని ఆయన విమర్శించారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు.