శారదాపీఠం స్వరూపానందకు, వైవీ సుబ్బారెడ్డికి ఎక్కడ తేడా కొట్టింది?
విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపాందస్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలున్నట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అందుకు ఉదాహరణగా స్వరూపానంద తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని కొనియాడిన సంగతిని ఉదహరిస్తున్నారు. భూమన గతంలో తితిదే చైర్మన్గా పనిచేసిన సంగతి తెలిసిందే.
తిరుపతిలో గంగమ్మ జాత కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమన స్వరూపానందతోపాటు ఆయన పీఠం వారసుడు స్వాత్మేత్రానందను కూడా ఆహ్వానించారు. జాతరకు వచ్చిన స్వరూపానంద కరుణాకర్రెడ్డిలాంటి తితిదే చైర్మన్లు పాలకమండలికి మళ్లీ రారని, అటువంటి ఇక పుట్టబోరు అంటూ విపరీతంగా కొనియాడారు. ఇప్పుడున్న పాలక మండలి చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఒక్కటి కూడా చేపట్టలేదంటూ విమర్శించారు. అంతేకాదు.. గొప్ప కార్యక్రమాలు చేపట్టలేకపోవడానికి కరోనా కారణమా? లేదంటే బుద్ధి మాంద్యం కారణమా? అనేది తమకు తెలియడంలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైవీ సుబ్బారెడ్డి, స్వరూపానందకు ఎక్కడ తేడా కొట్టిందా అర్థం కావడంలేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. వైవీ సుబ్బారెడ్డి ఆయన్ను తరుచుగా కలుస్తూనే ఉంటారని, విశాఖపట్నంలో లేకపోయినా, దేశంలో ఏ ఇతర ప్రాంతంలో ఉన్నా కచ్చితంగా కలిసివస్తారని చెబుతున్నారు. అటువంటిది ఇప్పుడు వీరిద్దరికీ ఏమైంది? అనే చర్చ వైసీపీలో నడుస్తోంది. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరికొన్ని వ్యాఖ్యలు చేయబోతున్నట్లు స్వరూపానంద చెప్పారు.
తితిదేలో అసలు ఏం జరుగుతోంది? వైవీ సుబ్బారెడ్డి స్వరూపానందను ఎక్కడ తక్కువ చేశారు? ఆయన అడిగిన పని చేయలేదా? .. అంటూ రకరకాలుగా వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వాస్తవమేంటనేది వారిద్దరికే తెలియాలంటున్నారు. మరి ఈ విభేదాలను ఎవరు పరిష్కరిస్తారో చూద్దాం..!!












Click it and Unblock the Notifications