విభజనపై రాష్ట్ర నేతల కమిటీ!: ఏరాసు, డికె... ల చొరవ
ఈ విషయంలో న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. సిడబ్ల్యూసి తీర్మానం ప్రకారం రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ, కోస్తాంధ్ర బాగానే ఉంటాయని కానీ, రాయలసీమే అన్యాయమై పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వస్తే కోస్తాకు నీటి కష్టాలు తీరుతాయని రాయలసీమ నీటి ఇక్కట్లు తొలిగే దారి కన్పించడం లేదని ఆయన చెబుతున్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రాంతం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణ, దుద్దిళ్ల శ్రీధర్ బాబువంటి కొందరితో, సీమాంధ్రలో గంటా శ్రీనివాస రావు, మహీధర్ రెడ్డి వంటి వారితో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభిస్తే బాగుంటుందని ఏరాసు చెబుతున్నారు. సీనియర్ మంత్రి రఘువీరా రెడ్డి కూడా సంప్రదింపుల విషయంలో సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కొందరు నేతల్లో కొన్ని సందేహాలున్నాయి.
విభజన తథ్యమని కాంగ్రెస్ పెద్దలు పదేపదే చెబుతున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇది జరిగేపనేనా? అనే అనుమానాలు వీరిలో తలెత్తుతున్నాయి. అందువల్ల ఇప్పుడే రాష్ట్ర విభజన తదనంతర పరిణామాలపై చర్చిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే వీలుందని భావిస్తున్నారు. వీరి అభిప్రాయాలతో ఏరాసు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉంటూ మున్ముందు రాబోయే కష్టనష్టాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని అంటున్నారు. ఇలాంటి సంప్రదింపుల వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని డికె అరుణ కూడా అభిప్రాయపడ్డారు.