జగన్ కేసులో ఈడి తొలి అభియోగపత్రం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దూకుడు పెంచిదంి. 2011లో సిబిఐ ఎఫ్ఐర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఈడి కూడా మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ - 3 కింద ఈసిఐఆర్ను నమోదు చేసింది. ఆ తర్వాత నిందితులకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను జప్తు చేస్తూ వచ్చింది.
జగతి పబ్లికేషన్స్కు సంబంధించిన వ్యవహారంపై నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో తొలి అభియోగపత్రం (ప్రాసిక్యూషన్ రిపోర్ట్) దాఖలు చేసింది. అక్రమ మార్గాల్లో వచ్చిన నిధుల ప్రవాహంపై, మళ్లింపులపై మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘనలను అభియోగాలుగా పేర్కొంది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆడిటర్ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్లను ఈడి పేర్కొన్నట్లు శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
విశ్వసనీయమైన సమాచారం మేరకు అభియోగ పత్రంలోని వివరాలంటూ మీడియాలో వచ్చిన విషయాలు ఇలా ఉన్నాయి.
జగన్, విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్ విలువ మదింపు బాధ్యతను డెల్లాయిట్ సంస్థకు అప్పగించారు. విజయసాయిరెడ్డి మోసపూరితంగా తప్పుడు సమాచారం ఇచ్చి, రూ.3050 కోట్లుగా మదింపు విలువను ఎక్కువ చేసి నివేదికను తెప్పించారు. దాని ఆధారంతో ప్రీమియం విలువను రూ.350గా నిర్ణయిస్తూ జగతి బోర్డు తీర్మానం చేసింది. జగతి పబ్లికేషన్స్లో 2012 మార్చి 31 నాటికి మొత్తం రూ.1,246 రోట్ల పెట్టుబడి పెట్టింది. ఇందులో రూ.1,173 కోట్లు బయటి వ్యక్తులదే. కానీ వీరికి జగతిలో దక్కింది 30 శాతం వాటానే. అయితే, కేవలం రూ.73 కోట్లు మదుపు చేసిన కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ ద్వారా 70 శాతం వాటాతో జగన్ యాజమాన్యం హక్కులను దక్కించుకున్నారు.
కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో ఎలాంటి సమస్య కూడా లేకుడా సిమెంట్ పరిశ్రమను నడిపించుకోవాలంటే జగతిలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలని చెన్నైకి చెందిన జయలక్ష్మి టెక్స్టైల్స్ డైరెక్టర్ టి.ఆర్. కన్నన్కు విజయసాయిరెడ్డి నుంచి సమాచారం వెళ్లింది. అలా కన్నన్ జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు పెట్టారు.
దుబాయ్లో జరిగిన సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పెట్టుబడులను ఆహ్వానించారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఎన్నారై మాధవ చంద్రకు సాయిరెడ్డి ఫోన్ చేశారు. జగతిలో పెట్టుబడులు పెట్టాలని ప్రలోభ పెట్టారు. దాంతో రూ.10 కోట్లు కంపెనీ నిధుల నుంచి, మిత్రుడి నించి మరో రు.9.66 కోట్లు రుణంగా తీసుకుని ఆయన రూ.19.66 కోట్లను జగతిలో పెట్టుబడులు పెట్టారు.
అరవింద్ కుమార్ దండమూడి అనే వ్యక్తి నుంచి జగతి ప్రతినిధి శ్రీధర్ రూ.10 కోట్ల పెట్టుబడిని రాబట్టారు.
దర్యాప్తు సందర్భంగా వీరి వాంగ్మూలాలను ఈడి సేకరించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. వారి పెట్టుబడులకు ఏ విధమైన డివిడెండ్లు రాలేదని ఈడి గుర్తించినట్లు ఆ వార్తాకథనాలు తెలిపాయి. ఎన్నారైల నుంచి జగన్ కంపెనీల్లోకి నిధుల మళ్లింపులో మనీలాండరింగ్ ఉల్లంఘనలు జరిగాయని ఈడి పేర్కొంది. ఇప్పటికే కన్నన్, రామచంద్ర, దండమూడిల పెట్టుబడులకు సమానమైన రూ.34 కోట్ల విలువైన జగతి పబ్లికేషన్స్ బ్యాంక్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది.