కేసీఆర్ చెప్పారు, కానీ: ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌పై ఈటెల ట్విస్ట్

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌ నుంచి గోదావరి నది మీదుగా రెండు నెలల్లో లైన్‌ వేస్తామని కేసీఆర్‌ సీఎం కాకముందు చెప్పిన మాట నిజమేనని, ఆయన చేసిన ప్రకటన తప్పు అని అనటం లేదని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ లైన్‌ వేయటం కోసం సర్వే చేసేందుకు సిద్ధపడ్డాక సమస్యలు గుర్తించామని, అందుకే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని, అలా చేయటంకంటే తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవటం మంచిదనుకున్నామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.

దండకారణ్యం, నక్సలైట్‌ ప్రాంతం కావటం వల్లనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి గోదావరి నది మీదుగా తెలంగాణకు విద్యుత్‌ లైన్‌ వేయలేదని ఈటెల చెప్పారు. తెలంగాణ వచ్చాక కొత్త రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తీర్చటానికి మిగులు ఉన్న ఛత్తీస్‌గఢ్‌ నుంచి గోదావరి నది మీదుగా రెండు నెలల్లో లైన్‌ చేస్తామని చెప్పినప్పటికీ, సమస్యల వల్లనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు బీహెచ్‌ఈఎల్‌తో తమ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కూడా కుదుర్చుకుందన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, బి వెంకటేశ్వర్లు, భానుప్రసాదరావు తదితర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, కరెంట్‌ కష్టాలకు కారణమైన కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఇప్పుడు స్థానిక రైతాంగంపై ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి ఉత్పత్తి మొదలైనా, అందులో 54 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాల్సివస్తుందని అసలు ఆ కేంద్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి జరగటంలేదని ఆంధ్రప్రదేశ్ సర్కారు అబద్ధాలు ఆడుతోందన్నారు.

 Etela Rajander clarifies on power crisis

ఏపీలో కొత్త రాజధాని నిర్మాణానికి సమయం పడుతుందనే కారణంతో హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా వాడుకుంటామని కోరిన వారికి, కొత్త రాష్ట్రం తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కనీసం మూడేళ్ల సమయం పడుతుందనే ఇంగితజ్ఞానం లేదా అని ప్రశ్నించారు. ఒకవైపు రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే, మానవీయ కోణంలోనూ ఆలోచించకుండా శవాలపై పేలాలు ఏరుకుంటున్న టీడీపీకి తెలంగాణలో పుట్టగతులు ఉండవని చెప్పారు.

విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసమే కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో పరిశ్రమలకు కోతలు విధించామని, తాగునీటి అవసరాలకు ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీలో నిల్వ చేసిన నీళ్లనూ పొలాలకు వదులుతున్నట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం ఇంత చేస్తున్నప్పటికీ, విపక్షాలు విమర్శించటం వారి కుంచిత బుద్ధికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, టీడీపీలదే ఈ కరెంట్ పాపం అన్నారు.

తెరాస అధికారంలో లేనప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెందిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని చేసిన డిమాండ్‌కు ఇప్పుడు కట్టుబడి ఉన్నారా ? అని విలేకరులు ప్రశ్నిస్తే... ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెందిన కుటుంబాలకు ఏ ప్రభుత్వమైనా నష్టపరిహారం ఇస్తుందని, పూర్తి స్థాయిలో ఇవ్వకపోయినప్పటికీ, వారి కుటుంబాలను ఆదుకోవటం కనీస కర్తవ్యమన్నారు. దీపావళి పండుగ తర్వాత.. అమావాస్య వెళ్లాక అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+