వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెంబు పేరు చెప్పి...కోటి 13 లక్షలు కొట్టేశారు...మహిమల పేరుతో మోసం

|
Google Oneindia TeluguNews

విజయనగరం జిల్లా: మోసపోయేవాళ్లుంటే మోసం చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటారని తెలియజెప్పే విచిత్ర ఉదంతమిది. కేవలం చెంబు పేరు చెప్పి ఒక వ్యక్తి నుంచి ఓ బురిడీ గ్యాంగ్ కోటీ 13 లక్షలు కాజేసిందంటే నమ్ముతారా?...నమ్మినా నమ్మక పోయినా ఇదే నిజం...కోటీ 13 లక్షలు ఇచ్చినా చెంబు తనకు ఇవ్వకపోవడంతో మోసపోయిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఈ ఛీటింగ్ విషయం వెలుగుచూసింది. విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది.

పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా సుళ్లూరుపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వల్లేపు శేషగిరిని విజయనగరం జిల్లా బొబ్బిలి, పార్వతీపురానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మహిమ గల మంత్రపు చెంబు పేరిట దారుణంగా మోసం చేశారు. ఆ చెంబు పేరు చెప్పి ఆయన్నుంచి ఒక కోటీ 13 లక్షల రూపాయలు కొట్టేశారు. అంత డబ్బు ఇచ్చినా ఆ మోసగాళ్లు మంత్రపు చెంబును తనకు ఇవ్వలేదంటూ బాధితుడు శేషగిరి రామభద్రపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీంతో ఈ చెంబు గ్యాంగ్ మోసం బైటపడింది.

 రైలు ఎక్కడం...బుట్టలో పడటం...

రైలు ఎక్కడం...బుట్టలో పడటం...

పోలీసుల కథనం ప్రకారం...నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటకు చెందిన శేషగిరి 2017 అక్టోబర్ నెలలో రైలులో వ్యక్తిగత పనుల గురించి విశాఖ వస్తుండగా హైదరాబాద్‌కు చెందిన తేజ్‌మోహనరావు, విజయవాడకు చెందిన వెంకట్‌ అనే వ్యక్తులు పరిచయం అయ్యారు. మాటల్లో శేషగిరి చేసే వ్యాపారం, అతడి కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. శేషగిరి వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అప్పులు పాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన మాటల్లో ఈ కేటుగాళ్లు గ్రహించారు.

 కేటుగాళ్ల...మాయమాటలకు బోల్తా...

కేటుగాళ్ల...మాయమాటలకు బోల్తా...

తన వ్యాపార నష్టాల కారణంగా కుటుంబ సంబంధాలు కూడా అంత మెరుగ్గా లేవన్నట్లుగా శేషగిరి వారికి చెప్పాడు. దీంతో శేషగిరి మాటలను బట్టి అతడు భోళా మనిషని, అమాయకుడని గ్రహించిన ఈ మాయగాళ్లలో మోహనరావు అనే వ్యక్తి బాధితుని నిస్సహాయ పరిస్థితిని అవకాశంగా తీసుకొని రామభద్రపురం మండలంలో ఒక భజన బృందం దగ్గర మహిమ గల చెంబు ఉందని, దీనిని కొనుగోలు చేసి పూజగదిలో ఉంచితే వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని, తద్వారా అన్ని కష్టాలు తీరిపోతాయని నమ్మబలికారు. ఈ మహిమ గల చెంబుతో గతంలో చాలా మంది వ్యాపారులు ఇలా కష్టాల నుంచి బైటపడ్డారని కథలు కథలుగా చెప్పారు. దీంతో వారి మాటలకు పడిపోయిన శేషగిరి తనకు ఆ చెంబు కావాలని వారిని కోరాడు.

 చెంబు చూపించారు...కోట్లు పట్టేశారు...

చెంబు చూపించారు...కోట్లు పట్టేశారు...

దీంతో ఈ మోసగాళ్లు అదే నెలలో రామభద్రపురంలోని సత్యసాయి భజన మండలి దగ్గర ఉన్న ఒక చెంబును చూపించి బేరం పెట్టారు. చివరకు దాన్ని రూ. 1.13 కోట్లకు బేరాన్ని కుదుర్చుకోని అడ్వాన్స్‌గా రూ. 13 లక్షలు నిందితులు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ చెంబుకు పూర్తి స్థాయిలో మంత్ర శక్తులు రావాలంటే మళ్లీ కొన్ని పూజలు చెయ్యాల్సి ఉందని, ఆ పూజలు అయిపోగానే మిగిలిన సొమ్ము తీసుకొని ఆ చెంబు ఇచ్చేస్తామన్నారు. అలా ఆ తరువాత విడతలవారీగా మరో కోటి రూపాయలను తీసుకొని ఛీటింగ్ గ్యాంగ్ సభ్యులైన చింతాడ తేజ్‌ మోహనరావు అలియాస్‌ మోహన్‌ (హైదరాబాద్‌), శ్రీపతి కౌసల్య అలియాస్‌ పొట్టి ప్రసాద్‌ (పార్వతీపురం), చింతాడ ప్రియదాస్ (నర్సీపురం), ఏగిరెడ్డి చిట్టినాయుడు అలియాస్‌ రాంబాబు (బొబ్బిలి), కోరాడ సీతారాం అలియాస్‌ తిరుపతి (బొబ్బిలి), గళావల్లి రవి అలియాస్‌ దేవ (దళాయిపేట) పంచుకున్నారు. ఆ తరువాత త్వరలోనే చెంబు తీసుకొచ్చి అందచేస్తామని నమ్మించారు.

 మాయమాటలు...కాలయాపన...

మాయమాటలు...కాలయాపన...

అలా మూడు నెలలు గడుస్తున్నా మాటలే తప్ప చెంబు తెచ్చివ్వకపోవడంతో శేషగిరి గట్టిగా అడిగాడు. దీంతో డిసెంబర్‌ నెలలో చెంబు కోసం రమ్మంటూ శేషగిరిని సుళ్లూరుపేట నుంచి రప్పించారు. చెంబు తీసుకొచ్చామని పదండంటూ ఒక కారులో ఆయనను ఎక్కించుకొని విజయనగరం దాటిన తరువాత...పోలీసులు విశాఖపట్టణం వెళ్లే రూట్ లో తనిఖీలు చేస్తున్నారని సమాచారం వచ్చిందని...చెంబు వాళ్ల కంట పడితే ప్రమాదమని మరోసారి తీసుకెళ్లండంటూ ఆయనను కారు దింపేసి వెళ్లిపోయారు. ఆ తరువాత శేషగిరి చెంబును పంపించాలంటూ గ్యాంగ్ సభ్యులకు ఫోన్ చేస్తుంటే వారు ఏదో ఒక సాకు చెప్పి కాలయాపన చేస్తుంటే అనుమానం వచ్చిన ఆయన ఫిబ్రవరి ఒకటో తేదీన రామభధ్రాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 పోలీసులకు ఫిర్యాదు...చెంబు గ్యాంగ్ దొరికిపోయింది...

పోలీసులకు ఫిర్యాదు...చెంబు గ్యాంగ్ దొరికిపోయింది...

చెంబు పేరుతో కోటి రూపాయలకు పైగా గ్యాంగ్ మోసగించిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ఈనేపథ్యంలో చెంబు గ్యాంగ్ లోని ఆరుగురు సోమవారం అనుమానాస్పదంగా రామభద్రపురం నుంచి రాజాం వెళ్లే రోడ్డులో సంచరిస్తుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు తాము చెంబు పేరుతో మోసగించింది నిజమేనని, అయితే శేషగిరి చెబుతున్నంత మొత్తం రూ. 1.13 కోట్లు తీసుకోలేదని కేవలం రూ. 30 లక్షలు మాత్రమే అతడు తమకు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఈ నిందితులపై గతంలో మహిమ గల నాణేలను విక్రయిస్తామంటూ మోసగించిన కేసులు ఉన్నట్లు తెలిసింది. బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, రాయఘడ ప్రాంతాల్లో వీరు మహిమలున్న నాణేలంటూ పలువురి వద్ద నగదు కాజేసి ఉడాయించినట్లు కేసులున్నాయని తెలిసిందని ఎస్‌ఐ డీడీ నాయుడు తెలిపారు. నిందితుల నుంచి రూ. లక్ష, మహిమ గల చెంబు స్వాధీనం చేసుకుని సాలూరు జ్యుడీషియల్‌ కోర్టుకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసుల ఉన్నతాధికారులు ప్రశంసించారు.

English summary
Vizayanagaram: A gang, allegedly involved in cheating people to the tune of Rs1.13 crore by offering to sell a "A Beaker with magic powers", were busted by the Ramabhadrapuram police onTuesday .Sleuths of police arrested Ch.Mohan rao,Sripathi kousalya,Ch.Priyadas,Y.Chitti naidu,k.sitaram, G.Ravi on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X