వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇళ్ళలో ఐటీ సోదాలు; తెలంగాణాలోనూ ఐటీ దాడుల కలకలం!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరి పైన దాడి చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ దాడులు అటు రాజకీయ వర్గాలను, ఇటు వ్యాపార వేత్తలను కలవరపెడుతున్నాయి. తాజాగా విజయవాడలో ను, హైదరాబాద్ లోని కొనసాగుతున్న ఐటీ దాడులు కలకలంగా మారాయి.
విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జి అయిన దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుండి అధికారులు విజయవాడ గుణదలలోని దేవినేని అవినాష్ నివాసంతో పాటు అవినాష్ కు సంబంధించిన ఆస్తులపై పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేవినేని అవినాష్ నివాసంలో మాత్రమే కాకుండా వల్లభనేని వంశీ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లుగా సమాచారం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో , ఆయనకు సంబంధించిన ఆస్తులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మొత్తం రంగంలోకి దిగిన ఐదు టీమ్ లు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది . అయితే ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలు ఏ నేపథ్యంలో జరుగుతున్నాయనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఇద్దరు నేతలు గతంలో టీడీపీ నుండి వైసీపీ బాట పట్టిన నేతలు కావటం గమనార్హం.
ఇదిలా ఉంటే అటు హైదరాబాద్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఒక ప్రముఖ బిల్డర్ కు సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయంతోపాటు ఇళ్లలో ఐటి సోదాలు కొనసాగుతున్నట్లు గా సమాచారం. వంశీ రామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి బావమరిది జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఇంతకు ముందు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్ళపై, కార్యాలయాలపై దాడులు జరిగాయి. మొత్తంగా హైదరాబాద్ లో 15 చోట్ల నేడు ఐటి దాడులు కొనసాగుతున్నట్లు గా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐటీ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.